Suryaa.co.in

Telangana

సరికొత్త రికార్డులతో తెలంగాణ రాష్ట్రం

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

సరికొత్త రికార్డులతో తెలంగాణ రాష్ట్రం దేశ ప్రజలను ఆకర్షిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారథ్యంలో ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

జాతీయ సామాజిక శాస్త్రాల అధ్యయన కేంద్రం.. ఐసీఎస్ఎస్ఆర్ – ఎస్ఆర్సీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

“ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సామాజిక సమూహాల సాధికారత – తెలంగాణ రాష్ట్ర అనుభవాలు” అనే అంశంపై జరుగుతున్న సదస్సులో వ్యవసాయం, విద్య, కమ్యూనిటీ & వృత్తి ఆధారిత పథకాలు, మహిళా సాధికారత, నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, అటవీ అభివృద్ధి సహా అనేక పథకాల తీరుతెన్నులు, అభివృద్ధిని వినోద్ కుమార్ వివరించారు.

విద్యుత్తు లోటు నుంచి మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని…. భారత దేశానికి కొత్త రైస్ బౌల్‌గా తెలంగాణ మారిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ మాట్లాడుతూ… స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారత్‌లో ఆర్థికాభివృద్ధికి సంబంధించిన వివిధ దశలపై విపులంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను అమల్లో ఉన్న సవాళ్లను ఆయన వివరించారు.

ఐసీఎస్ఎస్ఆర్ సభ్యకార్యదర్శి, న్యూఢిల్లీ ప్రొఫెసర్ ధనుంజయ్ సింగ్ ప్రసంగిస్తూ….యాభై సంవత్సరాల ప్రయాణంలో ICSSR SRC యొక్క సహకారాన్ని ప్రశంసించారు. ICSSR ఇటీవల ప్రకటించిన స్వల్పకాలిక పథకాలలో అనుభావిక అధ్యయనాలను చేపట్టాలని ఆయన పరిశోధకులను కోరారు.

ICSSR-SRC సంచాలకులు Prof. B. సుధాకర్ మాట్లాడుతూ…. జాతీయ సదస్సుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న థీమ్ లను వివరించారు. IPE డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస మూర్తి, వివిధ ఫ్యాకల్టీలకు చెందిన డైరెక్టర్లు, డీన్లు, ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.పార్టిసిపెంట్స్, పేపర్ ప్రజెంటర్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, హర్యానా నుంచి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE