– తెలంగాణ వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి
– స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ యోధులకు గుర్తింపు లేదు
– మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, ఎం.పీ. అసదుద్దీన్ ఓవైసి , రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్: దేశ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ప్రాంత ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన యోధులకు గుర్తింపు లేకుండా పోయిందని, అసలు తెలంగాణ చరిత్రను సమైక్యపాలనలో వక్రీకరించారని, ఈ నేపథ్యంలో తెలంగాణ వాస్తవ చరిత్రను భావి తరాలకు అందించేందుకు తెలంగాణ చరిత్రలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి , రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు.
గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ” అన్ వెప్ట్ అండ్ అన్ సంగ్ హీరోస్ అఫ్ తెలంగాణ ” అనే అంశంపై జరిగిన సెమినార్ లో వారు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అసదుద్దీన్ ఓవైసి , చిన్నారెడ్డి మాట్లాడుతూ వక్రీకరించబడ్డ తెలంగాణ వాస్తవ చరిత్రను తిరిగి రాసేందుకు అవసరమైన నిధుల కోసం తాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలోనే భేటీ కానున్నట్లు తెలిపారు.
90 ఏళ్ల దేశ స్వాతంత్ర పోరాటంలో కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే పాల్గొన్నట్లు, తెలంగాణ ప్రాంత యోధులు లేనేలేనట్లు చరిత్ర ఉందని, ఇది సరైంది కాదని వారు పేర్కొన్నారు.
స్వాతంత్ర పోరాటంలో హైదరాబాద్ లోని ఆంగ్లేయుల రెసిడెన్సీపై దాడి చేసిన హైదరాబాద్ యోధులు మౌల్వి ఆలాఉద్దీన్, తుర్రే బాజ్ ఖాన్, చిదా ఖాన్ పేర్లు చరిత్రలో కానరావని వారు అన్నారు. సెల్యూలార్ (కాలాపాని) జైలులో మౌల్వి ఆలాఉద్దీన్ 30 ఏళ్ళు శిక్ష అనుభవించారని, ఆ జైలులో తొలి భారతీయుడుగా మౌల్వి శిక్ష అనుభవించారని, తుర్రే బాజ్ ఖాన్ ను ఆంగ్లేయులు కాల్చి చంపారని వారు వివరించారు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు పర్సనల్ సెక్రటరీగా పని చేసిన హైదరాబాద్ గ్రామర్ స్కూల్ లో చదువుకున్న ఆబిద్ అలీ హాసన్ సఫ్రాని దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారని, మూడు నెలలపాటు సబ్ మేరైన్ లో గడిపారని, సఫ్రాని ” జై హింద్ ” నినాదాన్ని సృష్టించిన ఘనత పొందారని వారు పేర్కొన్నారు.
ఇలాంటి అనేక మంది స్వాతంత్ర పోరాట యోధుల పేర్లు చరిత్రలో లేవని, ఇలాంటి పొరపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసి, చిన్నారెడ్డి అభిప్రాయ పడ్డారు.
తెలంగాణ చరిత్రను తిరిగి రాసే బాధ్యతలను కెప్టెన్ పాండు రంగారెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారని, వారి నాయకత్వంలో తెలంగాణ చరిత్ర తిరిగి రాయనున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ కౌన్సిల్ అఫ్ హిస్టారికల్ సెంటర్ ప్రధాన కార్యదర్శి టీ. వివేక్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో ప్రముఖులు జియా ఉద్దీన్ నయ్యర్, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.