– ‘ఇందాపూర్’ దెబ్బకు వైకాపా వెన్నులో వణుకు!
– పరువునష్టం కేసులతో హెరిటేజ్ సిద్ధమవుతుండటంతో సోషల్ మీడియాలో తొలగిస్తున్న వైనం!
సత్యం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందన్న సామెత, ప్రస్తుతం సాక్షి మీడియా మరియు వైకాపా సోషల్ మీడియా వికృత పోకడలకు అద్దం పడుతోంది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తమ హయాంలో జరిగిన అపరాధాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇందాపూర్ డెయిరీకి ‘హెరిటేజ్’ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని చూడటం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ లోకమంతా చీకటి అనుకున్నట్లు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక జాతీయ స్థాయి డెయిరీ సంస్థపై బురద చల్లడం ద్వారా భక్తులను మరోసారి వంచించే ప్రయత్నం జరుగుతోంది.
ఇందాపూర్ స్పష్టీకరణ – అబద్ధాలకు పాతర!
మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల అనుభవం ఉన్న ఇందాపూర్ డెయిరీ (Sonai Dairy) ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు హెరిటేజ్ ఫుడ్స్తో ఎటువంటి యాజమాన్య లేదా నిర్వహణ సంబంధాలు లేవని, కేవలం బీ2బీ (B2B) సరఫరాదారుగా మాత్రమే సంబంధం ఉందని తేల్చిచెప్పింది.
ఇందాపూర్ డెయిరీ పూర్తి స్వతంత్ర సంస్థ. ఏ ఇతర డెయిరీల ఒత్తిడి లేదా ప్రభావం తమపై లేదని సంస్థ స్పష్టం చేసింది.
2014-19 మధ్య కిలో నెయ్యి రూ. 278-306 కు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్న వైకాపా నేతలు, అప్పుడు పాల ధర లీటరుకు రూ. 17-20 మాత్రమే ఉండేదని మర్చిపోయినట్లు నటిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు, పాల ధరల (రూ. 42/లీ) ఆధారంగానే రూ. 658 ధర నిర్ణయించబడిందని సంస్థ గణాంకాలతో సహా వివరించింది.
సాక్షి ప్రచారం.. గోబెల్స్ శిష్యరికం!
సత్యానికి ఆమడ దూరంలో ఉండే సాక్షి ప్రచారాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎన్నడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని, కేవలం పనీర్, చీజ్ వంటి ఉత్పత్తుల కోసం మాత్రమే ఇందాపూర్తో ఒప్పందం కలిగి ఉందని సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
“తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురద చల్లడం సాక్షి మీడియాకు వెన్నతో పెట్టిన విద్య.” – ఇది భక్తుల మాట.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి సరఫరాపై విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. చిన్నపాటి డెయిరీలు ఒక్క చుక్క పాలు సేకరించకుండానే నెయ్యిని సరఫరా చేశాయని తేలింది. ఈ పాపాలను ప్రశ్నిస్తే, వెంటనే ‘హెరిటేజ్’ పేరు తీస్తూ పక్కదోవ పట్టించడం అటు దేవుడిని, ఇటు భక్తులను అవమానించడమే.
అబద్ధం వెయ్యి అడుగులు వేయవచ్చు, కానీ నిజం ఒక్క అడుగు వేస్తే అబద్ధం అంతర్థానం అవ్వాల్సిందే. ఇందాపూర్ డెయిరీ ఇచ్చిన క్లారిటీతో వైకాపా కుట్రలు బట్టబయలయ్యాయి. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపి, పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తే మంచిది. చట్టపరమైన చర్యలకు హెరిటేజ్ సిద్ధమవుతుండటంతో సోషల్మీడియాలలో తొలగిస్తున్నారు. కానీ ఈ పాటికి స్క్రీన్ షాట్లు తీసుకుని ఉంటే తప్పించుకోలేరు.
ఇందాపూర్ డెయిరీ నేపథ్యం!
ఇందాపూర్ డెయిరీ దేశంలోని అనేక అగ్రశ్రేణి సంస్థలకు నమ్మకమైన వ్యాపార సరఫరాదారుగా ఉంది. ఈ సంస్థ కేవలం హెరిటేజ్ మాత్రమే కాకుండా అమూల్, మదర్ డెయిరీ, బ్రిటానియా, దొడ్ల డెయిరీ వంటి దిగ్గజ కంపెనీలకు పాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఆధ్యాత్మిక రంగంలో పతంజలి, శ్రీ వేదసత్వ వంటి సంస్థలతో పాటు రిటైల్ రంగంలో డీ-మార్ట్, జొమాటో వంటి ప్రముఖ సంస్థలకు, వివిధ రాష్ట్రాల పాల సమాఖ్యలకు కూడా ఇది ఉత్పత్తులను అందిస్తోంది.
కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాకుండా షిరిడీ సాయి సంస్థాన్, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, గుజరాత్లోని అంబాజీ దేవాలయం, ముంబైలోని సిద్ధివినాయక ట్రస్ట్ మరియు కేరళలోని దేవస్వం బోర్డు వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది.
మహారాష్ట్రలోనే అతిపెద్ద డెయిరీగా పేరుగాంచిన ఈ సంస్థ ప్రతిరోజూ దాదాపు 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ, దేశంలోనే మొదటి ఐదు అతిపెద్ద డెయిరీలలో ఒకటిగా నిలిచింది. పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం నుండే రెండో అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొంది రష్యా, మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియా దేశాలకు తన ఉత్పత్తులను పంపిస్తోంది.
హెరిటేజ్ ఫుడ్స్తో ఈ సంస్థకు కేవలం వ్యాపారపరమైన సరఫరాదారుగా మాత్రమే సంబంధం ఉంది తప్ప, యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదని ఈ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతటి ఘనచరిత్ర మరియు నైతిక విలువలు కలిగిన సంస్థపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమో ఆలోచించి, చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి.
