– లీడర్, క్యాడర్ అంతా ఖాళీ
– రాహుల్ పాదయాత్రకు పయనం
– 27నుంచి మళ్లీ రాహుల్ భారత్ జోడో యాత్ర షురూ
– ఇక మునుగోడులో కాంగ్రెస్ ప్రచారం మరింత డల్
– ప్రచారంలో అభ్యర్ధి స్రవంతి ఒంటరి పోరాటం
– ఆర్ధికవనరుల్లో వెనకబడిన కాంగ్రెస్ అభ్యర్ధి
– పట్టించుకోని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
– మధ్యలోనే చేతులెత్తేసిన కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి?
– నిరాశా నిస్పృహలో కాంగ్రెస్ కార్యకర్తలు
-స్టార్ క్యాంపెయినర్లంతా రాహుల్ పాదయాత్రకు
– ఇప్పటికే ఆస్ట్రేలియాలో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి
– అక్కడి నుంచే తమ్ముడి కోసం చక్రం తిప్పుతున్న ఎంపీ కోమటిరెడ్డి?
– మునుగోడు ప్రచారంపై రాహుల్ పాదయాత్ర ప్రభావం ?
– ఫలితంగా టీఆర్ఎస్ వైపు చూస్తున్న కాంగ్రెస్ క్యాడర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
కాంగ్రెస్లో మును‘గోడు’ దారుణంగా వినిపిస్తోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ ప్రచారంపై, రాహుల్గాంధీ పాదయాత్ర ప్రభావం మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధికి, ప్రాణసంకటంగా పరిణమించింది. కాంగ్రెస్ యువరాజు రాహుల్ తెలంగాణ రాష్ర్టానికి రావడంతో.. పీసీసీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్లంతా పోలోమని ఆయన పాదయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనితో మునుగోడులో కాంగ్రెస్ ప్రచారానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్ధికవనరులు లేక అల్లాడుతున్న స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ఈ పరిణామాలతో టీఆర్ఎస్ వైపు చూడాల్సిన ఆశగా దుస్థితి కనిపిస్తోంది. పార్టీ అభ్యర్ధిని విజయతీరాలకు చేర్చాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఆర్ధికవనరుల అంశంలో చేతులెత్తేశారన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్ర, తెలంగాణలో దీపావళికి ముందు ప్రవేశించింది. దీపావళి సందర్భంగా బ్రేక్ ఇచ్చి ఢిల్లీకి వెళ్లిన రాహుల్, 27నుంచి తన పాదయాత్రను తిరిగి
ప్రారంభించనున్నారు. రాహుల్ రాష్ర్టానికి ప్రవేశించిన సందర్భంగా పీసీసీ చీఫ్ రాహుల్గాంధీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులంతా ఆయనను కలసి, పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు.
తిరిగి 27వ తేదీ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, మునుగోడు కాంగ్రెస్ ప్రచారం మరింత పేలవంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఉన్నంతవరకూ.. ఆయన వెంట పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేత, పీసీసీ ప్రముఖులు, పాదయాత్ర కమిటీలో
ఉన్న పార్టీ నేతలంతా ఉండాల్సిందే. వీరు కాకుండా.. రాహుల్ను ప్రసన్నం చేసుకునేంనదుకు, సీనియర్ నేతలు కూడా ఆయన వెంట నడవటం సహజం. ఫలితంగా మునుగోడులో కాంగ్రెస్ ప్రచారం మరింత బలహీనపడి, రాహుల్ పాదయాత్ర ప్రభావం ఉప ఎన్నిక ప్రచారంపై పడటం ఖాయమన్న ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తోంది.
వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారం బలహీనంగా మారింది. ఓవైపు టీఆర్ఎస్-బీజేపీ నాయకత్వాలు, ఒకరితో మరొకరు పోటీ పడి డబ్బు వెదజల్లుతున్నాయి.
కాంగ్రెస్ మాత్రం వారితో ఏ స్ధాయిలోనూ పోటీపడలేక చతికిలపడుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి వద్ద, వారిద్దరినీ ఎదుర్కొనే స్థాయిలో అర్ధబలం లేదన్న భావన ఇప్పటికే స్థిరపడిపోయింది. దానితో ఆమె కేవలం ప్రచారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాహుల్గాంధీ పాదయాత్ర ప్రారంభమయితే.. ఇక మునుగోడు ప్రచారానికి వచ్చే నాయకులెవరూ ఉండరన్న ఆందోళన, అభ్యర్ధి స్రవంతి వర్గీయుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక స్టార్ కాంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో ఉంటూ, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం కోసం పనిచేస్తున్నారు. మరో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఎంపీ కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ యువనేత రాహుల్ పాదయాత్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లయిన గీతారెడ్డి, అంజన్కుమార్యాదవ్, దామోదర్ రాజనర్శింహ, జగ్గారెడ్డి, అజారుద్దీన్, మహేష్కుమార్ గౌడ్,
ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీ వంటి ప్రముఖులంతా ఎలాగూ రాహుల్ పాదయాత్ర ముగిసే వరకూ, ఆయన వెంట ఉండటం తప్పనిసరి. ఫలితంగా మునుగోడులో కాంగ్రెస్ ప్రచారం, పూర్తి స్థాయిలో పడకేయడం ఖాయమన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీఆర్ఎస్-బీజేపీ నాయకత్వాలు డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెడుతూ ఓటర్లను ఆకర్షిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కేవలం ఓటర్లను కలిసి చేతులెత్తి నమస్కరించేందుకే పరిమితం కావడం, అటు ఆ పార్టీ క్యాడర్నూ నిరాశ పరుస్తోంది. రెండు పార్టీలూ తమ క్యాడర్కు కావలసినన్ని వనరులు సమకూరుస్తుంటే, తమ పార్టీ అభ్యర్ధి మాత్రం తమను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ క్యాడర్ను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉప ఎన్నిక జరిగే 3వ తేదీ నాటికి, కాంగ్రెస్ క్యాడర్ యుద్ధక్షేత్రం నుంచి నిష్ర్కమించే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్కు నిధులు సమకూర్చే అంశంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సహా, కాంగ్రెస్ అగ్రనేతలంతా విఫలమయ్యారన్న విమర్శ క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. చివరకు అదే జిల్లాకు చెందిన ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులెత్తేయడం కూడా కాంగ్రెస్ నేతల అసంతృప్తికి మరో కారణంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన సీనియర్లు.. ఇప్పుడు పార్టీ అభ్యర్ధి విజయానికి తలా ఓ చేయి వేయకుండా, తప్పించుకోవడ ంపై క్యాడర్ ఆగ్రహంతో ఉంది. ప్రధానంగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పార్టీ అభ్యర్ధి విజయానికి నిధులు సేకరించి, ఆదుకుంటారన్న భావన పార్టీ క్యాడర్లో మొన్నటివరకూ బలంగా ఉండేది. ఇప్పుడు ఆయన మౌనంగా ఉండటంతో, ఇక ఉప ఎన్నిక యుద్ధం నుంచి కాంగ్రెస్ నిష్ర్కమించక తప్పని అనివార్య పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఉంటూ, రెండు ప్రధాన పార్టీలపై యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ క్యాడర్పై పడే ప్రమాదం లేకపోలేదని, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థాయి నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ వెదజల్లే డబ్బు వలలో తమ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థాయి నేతలు పడిపోతే.. ఇక ఉప ఎన్నిక ప్రచారం చేయడం ష్టమేనని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.