Suryaa.co.in

Andhra Pradesh

జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్టులే
– హెల్త్ కార్డులు పునరుద్దిస్తాం -జిల్లా స్థాయిలో హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం
– అర్హులైన వారికి అక్రిడేషన్లు ఇస్తాం
– జర్నలిస్టుల స్థితి,గతులను మెరుగుపరుస్తాం
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

రామచంద్రపురం : రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రేయింబవళ్లు పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయూడబ్ల్యూజే ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాసభ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు కే స్వాతి ప్రసాద్ అధ్యక్షతన శనివారం రామచంద్రపురం లో జరిగింది.

ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి సుభాష్ మాట్లాడారు. తొలుత పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల స్థితి, గతులు మారేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జర్నలిస్టుల రక్షణ కోసం జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామన్నారు. అలాగే హెల్త్ కార్డులు పునరుద్దించటంతో పాటు, అర్హులైన వారికి అక్రిడిటేషన్లు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అందేలా కృషి చేస్తానన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. జర్నలిస్టుల కష్టాలు తనకు తెలుసని, సరేనా వేతనాలు లేకున్నా, కేవలం గౌరవం కోసం పనిచేసే జర్నలిస్టులు ఉన్నారన్నారు. జర్నలిస్టులు వాస్తవాలు రాయడంలో ముందుండాలని, కల్పితాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల ఆరోగ్య రక్షణ కోసం రామచంద్రపురం లో త్వరలోనే రామచంద్రపురంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమ సుందర్ మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టులకు వేతన చట్టం అమలు చేయాలని, దాడులు జరగకుండా పటిష్ట రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడుల విషయమై ప్రపంచంలోని 180 దేశాల్లో పోలిస్తే మన దేశం 151 వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల వేతన చట్టం 1955లో తీసుకొచ్చినప్పటికీ నేటికీ అమలు కాలేదన్నారు.

ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ కోసం పాలక పక్షాలు కృషిచేసి చత్తీస్గడ్ రాష్ట్రo తరహా చట్టాలు తీసుకురావాలన్నారు. జర్నలిస్టులకు వృత్తి భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలన్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కే స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల పక్షాన నిలబడి, అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి సుభాష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంపట్ల మంత్రి సుభాష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే కోనసీమ జిల్లా రామచంద్రపురం శాఖ ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ ను ఘనంగా గజమాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీరామమూర్తి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఎంపీపీ అంబటి భవాని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE