-చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లేఖ ఫేక్
-చంద్రబాబు భద్రతపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్
రాజమహేంద్రవరం : చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ నడుస్తుంది. జైలు చుట్టూ ఐదు వాచ్టవర్స్ ఉన్నాయి. బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. ప్రతీ గంటకో మారు గార్డ్ సెర్చ్ చేస్తున్నాం.
ఎస్పీ తో మాట్లాడి ప్రత్యేకంగా సెంట్రల్ పోలీస్ లైన్ టీమ్తో జైలు చుట్టుపక్కలా వాచింగ్ నడుస్తుంది. ఈనెల 22వ తేదీన జైలు వాటర్ ట్యాంక్ వైపు ఒక డ్రోన్ తిరిగిందని నార్త్ఈస్ట్ వాచ్టవర్ గార్డు నుంచి మాకు సమాచారం వచ్చింది. అయితే, క్లోజ్డ్ జైల్ వైపు ఆ డ్రోన్ రాలేదు. దీనిపై మేం జైళ్లశాఖ నుంచి అధికారికంగానే సమీప పోలీసుస్టేషన్కు కమ్యూనికేషన్ అందించాం. ఆ తర్వాత మా జైల్పై ఎలాంటి డ్రోన్స్ రాకపోకలు జరగలేదు.
మావోల పేరుతో వచ్చిన లేఖ వరిజినల్ కాదు. అది నకిలీ లేఖగా గుర్తించాం. చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లేఖ ఫేక్ అని విచారణలో తేలింది.
జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్కు జైలు అధికారుల అటెస్టేషన్ చేయలేదు. జైల్లోకి వచ్చే ప్రతీ ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకనే లోపలికి అనుమతిస్తాం. శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్కు తెచ్చినప్పుడు ఆయన వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్లు గుర్తించాం. అయితే, వెంటనే దాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా.. అందులో ఎలాంటి జైల్ ఫుటేజీ లేదు. అతని ఫ్యామిలీ ఫోటోస్ రెండు ఉన్నాయి. మేం స్వాధీనం చేసుకున్న కెమెరాను కూడా పోలీసు వారికి అప్పగించాం. దాన్ని రిమాండ్ ఖైదీ ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతుంది.
చంద్రబాబు వచ్చిన దగ్గర్నుంచీ ఈరోజు వరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరిన దాఖల్లాల్లేవు. అది ఎప్పటికీ జరిగే అవకాశమేలేదు. చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్ ఆపరేషన్కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించాము. వారు పరీక్షలు చేశారు. చంద్రబాబుకు ఇమ్మెచ్చ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కొంత సమయం తర్వాతైనా ఆపరేషన్ చేయించుకోవచ్చని వైద్యులు సూచించారు.
చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేము ఎలాంటి తప్పుడు రిపోర్టు బయటకు ఇవ్వలేదు. ఆయన ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నాం. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహా బ్యారెక్లో చంద్రబాబును ఏ రూమ్లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించము. జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి ప్రభుత్వ వైద్యులకు చెప్పారు. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు కూడా రాశాం.
చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో సజెషన్ ఇవ్వాలని భువనేశ్వరి కి కూడా తెలియజేశాం. ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియపరిచాం.
రాజమండ్రి ఎస్పీ జగదీష్ ఏమన్నారంటే
రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట వైపు 24 గంటలపాటూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా వాచ్ జరుగుతుంది. జైలు చుట్టుపక్కల అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది. మావోయిస్టు లేఖ అనే దానిపై పూర్తిగా లోతైన విచారణ చేయించాం. అది ఫేక్ లెటర్ అని గుర్తించాం.