-మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వాలు
-ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి
మీడియా ఎల్లప్పుడూ ప్రజల పక్షమే ఉండాలని, ఆదే అత్యంత ప్రాధాన్యత అని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ అన్నారు. అక్టోబరు 29, 30 మరియు 31వ తేదీలలో చేన్నైలో జరిగే ఇండియన్ జర్నలిస్టు యూనియన్ 10వ ప్లీనరీకి సన్నాహంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సెమినార్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో విజయవాడలోని అలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో “‘ప్రజలు, ప్రభుత్వం-మీడియా బాధ్యత” అనే అంశంపై శనివారం ఈ సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలపట్ల, సమాజంపట్ల బాధ్యతతో వ్యవహరించాలన్నారు. సహేతుకమైన ఆధారాలు లేకుండా వార్తలు రాస్తున్నారని దీంతో ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్ గా ఉన్న మీడియా ప్రజల్లో నమ్మకం కోల్పోతుందన్నారు. పరిశోధనాత్మక జర్నలిజం కూడా పూర్తి పారదర్శకంగా ఉండటం లేదన్నారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే జర్నలిస్టులకు గుర్తింపు ఉంటుందన్నారు. సోషల్ మీడియా కారణంగా జర్నలిస్టుల విలువ మరింత దిగజారిందన్నారు. న్యాయపరమైన చిక్కులుతో అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని హితవు పలికారు.
ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి సందేశమిస్తూ మీడియా స్వేచ్ఛను హరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సమాజంలో మీడియా కీలక పాత్ర పోషిస్తున్నా జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వార్తలు రాస్తే, కార్టూన్లు గీస్తే ప్రభుత్వాలు కన్నెర చేస్తున్నాయన్నారు. వార్తా కథనం పాలకులకు నచ్చకపోతే దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారులను కలిసి సమాచారం. సేకరించే హక్కు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వాలకు మంచి, చెడు చెప్పే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఇది భవిషుత్తులో మీడియా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. జర్నలిజం వృత్తి ప్రమాదకరమైన వృత్తిగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించిందని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ జి. అనిత మాట్లాడుతూ నిజమైన జర్నలిస్టులకు కనీసవేతనం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సోర్స్ క్రెడిబిలిటీ అనేది జర్నలిజంలో చాలా కీలకం అన్నారు. అప్పుడు ఆ సోర్స్ అనేది లేకుండా పాలకులు చంపేస్తున్నారని తెలిపారు. పెద్ద మీడియాలో పని చేసినంత మాత్రమా సంతృప్తిగా ఉన్నారనేది అవాస్తం అని అన్నారు. ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి అంజనేయులు మాట్లాడుతూ వ్యాపారులు మీడియాలోకి వచ్చిన తరువాత విలువలు దిగజారిపోయాయని చెప్పారు. నిజమైన జర్నలిస్టులు ఉన్నా మేనేజ్మెంట్ పాలసీ ప్రకారంమే వార్తలు రాయాల్సి ఉందన్నారు.
ఐజేయూ కార్యవర్గ సభ్యులు సోమసుందర్ మాట్లాడుతూ పచ్చమీడియా, నీలిమీడియా యాజమాన్యాలు కలసి జర్నలిస్టు సమ్మె విచ్చినానికి గతంలో ఒడిగట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలపై మాత్రం యాజమాన్యాలు. స్పందించటం లేదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉన్న హక్కులను ప్రభుత్వాలు నాశనం చేశాయని విమర్శించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఏపీయూడబ్యుజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ. సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులపై కేసులు పెట్టటం సాధారణ విషయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ప్రభుత్వాలు యాజమాన్య కోణంతో చూడకూడదన్నారు. తొలుత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసదస్సుకు వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో హాజరైయ్యారు.