Suryaa.co.in

Andhra Pradesh

గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకు రావల్సి వస్తోంది

* జగనన్న కాలనీలు పేరుతో లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి ప్రజలను ముంచేశారు
* కనీస సౌకర్యాల కల్పన లేకుండా ప్రజలను మోసం చేశారు
* ఏలేరు వరద పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నాం
* ఏలేరు, సుద్దగడ్డ ముంపు నుంచి రైతాంగానికి, ప్రజలకు ఊరట ఇచ్చేలా ప్రత్యేక చర్యలు
* బుడమేరు ఆక్రమణదారులపై హైడ్రా వంటి తీరు కంటే చర్యలే ఉత్తమం
* విజయవాడ విపత్తును కూటమి ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొంది
* ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకున్నాం
* పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీని స్వయంగా పర్యటించి, ముంపు బాధితులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 
* 400 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున ప్రకటించిన విరాళం జమపై సమీక్షకు మంగళగిరి బయలుదేరిన పవన్ కళ్యాణ్ 

పిఠాపురం: ‘వైఎస్సార్.. జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బలైపోయారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేం సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. చినుకు పడితే చాలు మునిగిపోయే భూములను కాలనీల కోసం కొని, కనీస వసతులు కూడా కల్పించకుండా ప్రజలకు ఇచ్చింది.

గత ప్రభుత్వం ఆ కాలనీలు పేరుతో కొన్న స్థలాల మార్కెట్ ధరకు, చెల్లించిన పరిహారానికి చాలా వ్యత్యాసం ఉంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.

సుద్దగడ్డ పూర్తిస్థాయిలో పొంగడంతో కాలనీకి వెళ్లే రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. దీంతో కాలనీ వాసులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పడవలో వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడారు. ముంపులో ఉండిపోయిన వారి బాధలను తెలుసుకొని స్వయంగా ఇళ్లను పరిశీలించారు. వరదలో ఉండిపోయిన బాధితులకు తక్షణ సహాయం అందించేలా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్ అధికారులకి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “గత ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలో చినుకు పడితే వరద వచ్చే పరిస్థితి ఉంది. నాలుగు అడుగుల లోతట్టు ప్రాంతంలో గొల్లప్రోలులో స్థలాలు ఇచ్చారు. మొత్తం 38 ఎకరాల్లో రెండు వేల మందికి స్థలాలు ఇచ్చారు. ఈ ప్రాంతం ముంపు ప్రాంతం అని తెలిసిన ఇక్కడ ఎకరా ధర రూ. 30 లక్షలు మించి లేకపోయినా, ఎకరాకు రూ. 60 లక్షల ప్రభుత్వ పరిహారం చెల్లించారు. పోనీ పట్టాలు ఇచ్చిన వారైనా ఇక్కడికి వచ్చారా అంటే అది లేదు. 10 శాతం మంది కూడా రాలేదు. ఇంతటి లోతట్టు ప్రాంతం అని తెలిసినా గత ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా ప్రజలను ముంచేసింది.

ఏలేరు పరిస్థితిపై నిరంతర సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పటికప్పుడు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఈ నెల 1, 2 తేదీల్లోనే జిల్లా కలెక్టర్ తో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. అపాయకరమైన పరిస్థితి ఏమీ లేదని ఆయన చెప్పారు. అయితే అప్పటినుంచి నిరంతరం పడుతున్న వానలతో రిజర్వాయర్ కు అన్ని వైపుల నుంచి వరద వచ్చింది. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు ఆరోగ్యం సహకరించకున్నా స్వయంగా వచ్చాను. ఈ కాలనీలో పరిస్థితిని, ముంపు ప్రాంతాలను చూసిన తర్వాత కనీస సౌకర్యాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేసిందో అర్థమైంది.

ఎక్కడా కాలనీల్లో సౌకర్యాలు కల్పించకుండా, కేవలం భూములు కొనడం మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై అప్పటి పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. సుద్దగడ్డ వాగు ముంపు సమస్యను పరిష్కరిస్తాము. దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. కాలనీకు కనీసం ఒక వంతెన నిర్మించి ఉంటే చాలామందికి అనువుగా ఉండేది.

వరదల్లో కనీసం బయట ప్రాంతంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాను. ఏలేరు, సుద్దగడ్డ ముంపు నుంచి రైతాంగానికి, ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించాము.

ముఖ్యమంత్రి నేతృత్వంలో సమష్టిగా పని చేశాం

అనుకోకుండా వచ్చిన బుడమేరు వరద వల్ల విజయవాడ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. తుపాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే మళ్లీ కోలుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాయి.

విపత్తు వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేసేలా ఆయన పూర్తిస్థాయిలో దృష్టి నిలిపారు. వరద బాధితులకు వెనువెంటనే సాయం అందే ఏర్పాట్లు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఈ విపత్తును సమర్థంగా, సమష్టిగా ఎదుర్కోగలిగాం. వరద తర్వాత కూడా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వరద బాధితులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు ఉంటాయి.

ఇప్పుడు వరద కష్టంలో ఉన్న పంచాయతీలకు నా వంతు బాధ్యతగా సొంత నిధులతో విరాళం అందించాను. ఆ నిధులు కచ్చితంగా పంచాయతీల ప్రాథమిక అవసరాలకు సరిపోతాయని భావిస్తాను” అన్నారు.

400 పంచాయతీలకు విరాళం జమపై సమీక్ష కోసం మంగళగిరికి
పవన్ కళ్యాణ్ గారు 400 వరద పీడిత పంచాయతీలకి రూ. లక్ష చొప్పున వ్యక్తిగత విరాళం ప్రకటించిన సంగతి విదితమే. ఆ మొత్తాలను ఈ రోజు నేరుగా సంబంధిత పంచాయతీల ఖాతాలకి జమ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియపై సమీక్ష నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో పర్యటన ముగించుకొని మంగళగిరికి బయలుదేరారు.

LEAVE A RESPONSE