– కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఘనంగా వేడుక
– గురువారం రాత్రి న్యూఢిల్లీ నుండి వియత్నాం ప్రదర్శనకు బుద్ధ భగవానుని అవశేషాలు తరలింపు కార్యక్రమం
– తమ పవిత్ర ప్రయాణం వియత్నాం చేరుకుందని, ఆ గౌరవం పొందినందుకు గర్వంగా ఉందన్న మంత్రి దుర్గేష్
వియత్నాం: భారతదేశం, వియత్నాం దేశాల మధ్య అధ్యాత్మిక సామరస్యాన్ని, బలమైన సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించేలా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవానుని అవశేషాల ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గురువారం రాత్రి న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాల పేటికకు నమస్కరించి పటిష్ఠ భద్రత నడుమ భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్) చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో తమ పవిత్ర ప్రయాణం ప్రారంభించామన్నారు.
అనంతరం భారతదేశం నుండి తీసుకువచ్చిన పవిత్ర బుద్ధ భగవానుని అవశేషాలను శుక్రవారం ఉదయం వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలోని బుద్ధ హాలులో అంగరంగ వైభవంగా ప్రతిష్టించామన్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి బుద్ధుని పవిత్ర అవశేషాలను వియత్నాం తీసుకువచ్చే పవిత్ర ప్రయాణం అధ్యాత్మిక ఆనందాన్నిచ్చిందని, ఆ గౌరవం పొందినందుకు గర్వంగా ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు.
మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో జరుగుతున్న బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమం భారతీయ నాగరికత, శాంతియుత, సహన వారసత్వానికి శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హెూచిమిన్హ్ నగరంలో జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమం లో ప్రదర్శించనున్నామన్నారు.