Suryaa.co.in

Andhra Pradesh

పాఠశాలలు విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి : ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకే ఉన్నత పాఠశాల ఉంటే వెయ్యి మంది విద్యార్థులున్నా 3,4,5 తరగతులను విలీనం చేయాల్సిందేనని స్పష్టం చేసింది.చదువు కావాలంటే రైల్వేగేట్లు, కాల్వలు, జాతీయ రహదారులు దాడి రావాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలల విలీనానికి ఇవేమీ అడ్డురావని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అధికారిక రైల్వేగేట్లు, వంతెనలు ఉన్న కాల్వలు, జాతీయ రహదారులను పిల్లలు వెళ్లేందుకు అవరోధాలుగా పరిగణించొద్దని ఆదేశించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలిచ్చింది.జాతీయ రహదారులపై జీబ్రా క్రాసింగ్‌లు ఉంటాయని, పాఠశాలల ఆయాలు రోడ్డు దాటిస్తారని.. ఇది విలీనానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఒకే ఉన్నత పాఠశాల ఉంటే వెయ్యి మంది విద్యార్థులున్నా 3,4,5 తరగతులను విలీనం చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోతేనే ప్రాథమికోన్నత బడిలో విలీనం చేయాలని సూచించింది. ఒకవేళ ఒక ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో రెండు, మూడు ఉన్నత పాఠశాలలు ఉంటే మౌలికసదుపాయాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని మ్యాపింగ్‌ చేయాలని తెలిపింది.సమీపంలో బాలికల ఉన్నత పాఠశాల ఉంటే ఎనిమిదో తరగతి వరకు బాలురును అందులో విలీనం చేయనున్నారు. 3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉంటే 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఏడాదికి వెయ్యిరూపాయల చొప్పున సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి రవాణా ఛార్జీలు చెల్లించనున్నారు.

తరగతుల విలీనానికి తల్లిదండ్రుల కమిటీ తీర్మానాలు అవసరం లేదని తెలిపింది. ఆశ్రమ, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు మ్యాపింగ్‌ నుంచి మినహాయింపునిచ్చారు. వీటికి ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండే ఉన్నత పాఠశాలల హోదాను తగ్గించి, ప్రాథమికోన్నత బడులుగా మార్పు చేయనున్నారు.వీటిల్లో ఉండే 9,10 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు పంపిస్తారు. 3 కిలోమీటర్లలోపు ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాల లేకపోతే ప్రాథమిక తరగతుల వారిని ఇతర మాధ్యమ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.పదేళ్లలోపు ఉండే చిన్నారులు కాల్వలు, రైల్వేగేట్లు, జాతీయ రహదారులను దాటుకుని ఎలా వెళ్లగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో కాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటాయని.. ఇలాంటి సమయంలో పిల్లలను ఒంటరిగా బడికి ఎలా పంపగలమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE