Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ విధ్వంసంపై విడుదల చేసిన శ్వేతపత్రాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

– పొలిట్‌ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్‌ బ్యూరో సమావేశం గురువారం జరిగింది. ఆ వివరాలను ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు.

మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రజా రాజధాని అమరావతి-పోలవరం నిర్మాణం-నదుల అనుసంధానం, ఎనిమిది వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, 22 ఏ దుర్వినియోగం, ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం, నరేగా, నీరు-చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీల పరిష్కారానికి తగు యంత్రాంగం ఏర్పాటు, జన్మభూమి-2 ద్వారా పేదరికం లేని సమాజ నిర్మాణం, రూ.100కే పార్టీ సభ్యత్వంతోపాటు రూ.5 లక్షల ప్రమాద బీమా, ఐదేళ్ల జగన్మోహన్‌ రెడ్డి ఫేక్‌ ప్రచారం, విధ్వంస పాలనపై చర్చించారు.

ఎన్నికల విజయంలో కీలకపాత్ర వహించిన చంద్రబాబునాయుడిని పోలిట్‌బ్యూరో అభినందించింది. విభజన హామీల అమలుకు కేంద్ర బడ్జెట్‌లో చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వాన్ని పోలిట్‌బ్యూరో అభినందించింది. పలు అంశాలపై నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాలు, దోపిడీ, భూ కబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. వివేక హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు వైసీపీ నేతలు ఏ విధంగా ప్రయత్నించారో, మదనపల్లెలో భూ కుంభకోణాలకు సంబంధించిన సాక్షాలను తారుమారు చేసేందుకు కూడా అదే విధంగా కుట్ర చేశారు. వివేకాది గుండెపోటని ప్రచారం చేసినట్లే.. మదనపల్లెలో ఫైళ్లు దగ్ధాన్ని షార్ట్‌ సర్య్కూట్‌ అని ప్రచారం చేసి సాక్షాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించి ఉన్నతాధికారులను సంఘటనా స్థలానికి పంపడంతో వాస్తవాలు బట్టబయలయ్యాయి. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్కరోజులోనే వేలాది మంది బాధితులు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేశారంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో ఈ సంఘటన ద్వారా బట్టబయలయ్యిందన్నారు.

జగన్‌ రెడ్డిది నేరస్థుల గుంపు

వైసీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీలో ఉండేది ప్రజలకు సేవ చేద్దామని కాదు ప్రజల ఆస్తులను దోచుకోవడానికి. 13 లక్షలకు పైగా అసైన్డ్‌ భూములను కాజేయడంతో పాటు 40 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను రిజస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు. మరో వైపు 22ఏ అధికార దుర్వినియోగానికి ఉపయోగించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారు.

55 రోజుల్లో పాలనా విజయాలు

కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పింఛన్లు రూ.4 వేలకు పెంపు, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇవ్వడం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి వాటిని ప్రభుత్వం అమలు చేస్తుంది. దాతల నుంచి విరాళాలు సేకరించి తిరుమలలో అన్నదాన కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో అదే మాదిరి అన్న క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తాం. ఒక్క రోజులోనే 98 శాతానికి పైగా పింఛన్లను పంపిణీ చేసి వృద్ధులు, వికాలాంగులు ఎవరూ ఇబ్బందులు పడకుండా చేశాం. పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, సంపద సృష్టికి కృషి చేస్తాం. అలాగే ఇటీవల కురుసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుంది.

త్వరలోనే జన్మభూమి 2

రాష్ట్రాభివృద్ధికి నీతి ఆయోగ్‌ సహకారంతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. విజన్‌ 2020 మంచి ఫలితాలను ఇచ్చిందని అలానే విజన్‌ 2047ను రూపొందిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నాడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల సహకారంతో జన్మభూమి 2 కింద ప్రజలందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

కేంద్ర సహకారంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

విభజన చట్టం హామీల అమలుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పోలిట్‌ బ్యూరో ధన్యవాదాలు తెలియజేసింది. అమరావతి నిర్మాణానికి, పోలవరం పూర్తి చేయడానికి, 8 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడానికి సత్వరమే అంగీకరించడం శుభ పరిణామం. పోలవరం డయాం ఫ్రం వాల్‌ మూడు చోట్ల దెబ్బ తిన్నది. దానిపై ఏం చేయాలనేదానిపై కేంద్ర నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రం యొక్క పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. ఏపీలో కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుత విజయంతో ఢల్లీలోనూ మనకు ప్రత్యేక గౌరవం లభిస్తోంది.

రూ.100కే పార్టీ సభ్యత్వం, పార్టీ సభ్యుల ప్రమాద బీమా రూ.5 లక్షలకు పెంపు

పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ పోలిట్‌ బ్యూరో నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు. ఓటిపి ఎంటర్‌ చేసి రూ.100 రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి వెంటనే వాట్సాప్‌లోనే కార్డు అందజేస్తారు.

ఆ తర్వాత ఒరిజినల్‌ సభ్యత్వ కార్డును బూత్‌ల ద్వారా కార్యకర్తలకు అందజేస్తారు. పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఇప్పటివరకు రూ.120 కోట్లు మేర ప్రమాద బీమా అందించారు.

సంక్షేమ విభాగం తరుపున పార్టీ కుటుంబ సభ్యులైన 1,672 మంది విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం సుమారు రూ.2 కోట్ల 35 లక్షలు ఆర్థికం సహాయం అందించింది. విదేశాలలో చదువుతున్న, చదవాలనుకున్న సుమారు 180 మందికి కూడా అవసరమైన సహాయ, సహకారాలు అందించారు. పార్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ద్వారా 2 వేల మందికి శిక్షణను ఇచ్చి 850 మందికి రాష్ట్రంలో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. భవిష్యత్‌లో కార్యకర్తలు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ఎంపవర్‌ మెంట్‌ చేయాలని నిర్ణయించాం. కార్యకర్తల కుటుంబాల విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

నిబద్ధతతో పనిచేసిన వారికి నామినేటెడ్‌ పదవులు

నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేవి. ప్రభుత్వానికి, పార్టీకి సమాంతర ప్రాధాన్యత ఇస్తాం. గతంలో ఎన్నడూ చేయని విధంగా రాత్రింబవళ్లు కసరత్తు చేసి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందాం. ఇప్పుడు నామినేటెడ్‌ పోస్టుల విషయంలో కూడా అదే విధమైన కసరత్తు నిర్వహించి అర్హులన వారందరికీ, ప్రజామోదం ఉన్నవారందరికీ పదవులు లభిస్తాయి. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశల వారిగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులు తప్పనిసరిగా రావాలి. కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన జగన్‌ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేస్తున్నవారు. వైసీపీ విధ్వంస పాలన వల్ల ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కార్మికులు కూడావచ్చి ఎన్నికల్లో ఓటేశారు. అలానే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి వచ్చి ఏడాదిపాటు పనిచేసినవారు కూడా ఉన్నారు.

సకాలంలో వర్షాలు పడి రిజర్వాయర్లు నిండటం శుభపరిణామం. వ్యవసాయ అనుకూల వాతావరణం ఏర్పడింది. జిల్లాల జనాభా దామాషాను బట్టి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని పోలిట్‌ బ్యూరో ప్రతిపాదించింది. వైసీపీ తప్పుడు ప్రచారాలు, కుట్రలను పార్టీ శ్రేణులంతా వెంటనే తిప్పి కొట్టి ప్రజా చైతన్యం పెంచాలి. ఉచిత ఇసుక వంటి వాటిపై దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తగిన కృషి చేయాలని పోలిట్‌ బ్యూరో నిర్ణయించారు.

ఈ చారిత్రాత్మ విజయంలో భాగస్వాములైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవలు మరువలేనివని, వైసీపీ అవినీతి, అరాచకాలపై పోరాడి 52 రోజులపాటు జైలుకు వెళ్లొచ్చి, సమర్థవంతమైన నాయకత్వం అందించిన నారా చంద్రబాబు నాయుడుకి పొలిట్‌ బ్యూరో ధన్యవాదాలు తెలిపింది.

LEAVE A RESPONSE