– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: విశాఖ స్టీల్ పై కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్… ఆదుకోవడం పచ్చి అబద్ధం.
ఉద్ధరించడం అంతా బూటకమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…
ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ లో 44 ఈవోఐలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం. ఇది ప్లాంట్ ను చంపే కుట్రలో భాగమే. ఐదు వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? ఆ పనులను ఎందుకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు? పూర్వవైభవం అంటూ ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? ఇది స్టీల్ ప్లాంట్ యాజమాన్యపు దుర్మార్గపు చర్యకు నిదర్శనం. ఇది కూటమి ప్రభుత్వ చేతకాని తనానికి అద్దం పడుతుంది.
కేంద్రం డైరెక్షన్ లోనే దశల వారీగా ప్లాంట్ ను చంపుతున్నారు. మోడీ దోస్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారు. దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. ప్లాంట్ లో ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇచ్చిన ఈవోఐలను వెనక్కు తీసుకోవాలి. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వెనక్కు తీసుకొనే విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన కాంగ్రెస్ మరోదశ పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నాం.