– బీసీలపై కాంగ్రెస్ న్యాయానికి తార్కాణం ఈశ్వర్ చారి ఆత్మహత్య ఘటన
– ఈశ్వర్ చారి ఆత్మహత్య ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లాలోని మేడిపల్లిలో శ్రీ సాయి ఈశ్వర్ చారి అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని సామాజిక న్యాయం పూర్తిగా కూలిపోయిందనడానికి పెద్ద నిదర్శనం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హక్కులను అమలు చేయకపోవడం, ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం–వివక్షలతో తీవ్ర నిరాశ, ఆవేదనకు గురై సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యాయత్నం చేశాడు.
బీసీలను మోసం చేస్తూ, వారి హక్కులను హరిస్తూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారమే ఈ దారుణానికి కారణం. మృతుడు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందినవాడు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి జీడిమెట్ల సమీపంలోని జగద్గిరిగుట్టలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బీసీలకు సరైన అవకాశాలు, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటలు చెప్పి తీరా ఆ హామీని నిలుపుకోకుండా మోసం చేశారు. బీసీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు.
ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు.. గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ బీసీలను నయవంచకు గురిచేస్తోంది. ఈ వివక్షే ఒక యువకుడి మృతికి కారణమైంది. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు – ఇది బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వ్యవహార శైలికి ప్రతిబింబం. భారతీయ జనతా పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దారుణానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలి. బీసీ కార్పొరేషన్లకు నిధులను వెంటనే విడుదల చేయాలి. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలన్నింటిని క్లియర్ చేయాలి. బీసీల హక్కుల కోసం-తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బిజెపి పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. బీసీలకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అన్యాయం, అహంకార పాలనకు ముగింపు పలికేది ప్రజలే.