(చాకిరేవు)
టాలీవుడ్ ను తన కనుసైగలతో శాసించాలని కలలుగన్నాడు జగన్ బాలీవుడ్ ను దావుద్ దడిపించినట్లు!!
అందుకోసం లిక్కర్ కరెన్సీ కట్టలను కుమ్మరించాడు.
దాని కోసం నల్లధనం మీద దర్యాప్తు చేసే ఈడీ పేరున ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ తెరిపించడం పరాకాష్ట
జనం జేబులు గుల్ల చేసి, గుటకలేసిన లిక్కర్ సొమ్ముతో… వైకాపా నేత జగన్, రాజ్ కసిరెడ్డితో ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ అనే సరికొత్త ప్రొడక్షన్ హౌస్ను తెరిపించాడు. లిక్కర్ నల్లధనాన్ని వెండితెరపై తెల్లగా మార్చే సినిమాకు మించిన మాయాజాలం తాజా సిట్ దర్యాప్తులో బట్టబయలైంది! వాళ్ళు తీసిన “మళ్ళీ మొదలైంది” లాంటి సినిమాల్లో అసలు కథే లేదనుకుంటే, తెర వెనుక నల్ల కుబేరుల అదృశ్య హస్తం ఉందని దిమ్మతిరిగే నిజాలు తేలాయి!
‘మళ్ళీ మొదలైంది’.. కానీ అసలు బాగోతం ఇప్పుడే మొదలైంది!
సుమంత్ హీరోగా వచ్చిన “మళ్ళీ మొదలైంది” సినిమా చూసిన ప్రేక్షకులు “మళ్ళీ మాకింత కష్టమెందుకు నాయనా?” అనుకుంటే, అసలు కష్టం ఇక్కడ కాదు. ఈ సినిమా బడ్జెట్ రికార్డుల్లో కేవలం ₹12 కోట్లు ఉంటే, సిట్ దర్యాప్తులో ఏకంగా ₹40 కోట్ల నల్లధనం మాయాజాలం బయటపడింది.
అంటే, మన నిర్మాతలు సినిమా క్వాలిటీకి కాదు, డబ్బుల క్వాలిటీ (బ్లాక్ టు వైట్)కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట! పాపం, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొబ్బెట్లు కొట్టినా, ఓటీటీ హక్కులు, ఇతర లావాదేవీల ద్వారా ₹36 కోట్లు తెల్లగా మారాయంటే, ‘నల్ల డబ్బుకు నిజంగానే రంగుండదు’ అని రుజువు చేశారు! మరీ ముఖ్యంగా, ఒక నటుడి భార్య నుంచి ₹1 కోటి తీసుకుని, తిరిగి ఇవ్వకుండానే, ఆ డబ్బును తెల్లబట్టలు కట్టించి సినిమాలోకి లాగేశారట!
‘స్పై’ కథ: దొంగచాటుగా జరిగిన బడ్జెట్ గుట్టు!
నిఖిల్ సిద్ధార్థ్ నటించిన “స్పై” చిత్రంలో నేతాజీ అదృశ్యం రహస్యం ఉంటే, తెర వెనుక బడ్జెట్ అదృశ్యం రహస్యం అంతకు మించి ఉంది! నిఖిల్కి ₹10 కోట్లు చేతిలో పెట్టి, రికార్డుల్లో మాత్రం ₹90 లక్షలు చూపించారంటే, ఇది ‘సినిమా బడ్జెట్ లీకేజ్’ కాదు, ఏకంగా ‘నల్లధనం పారదర్శకత’ అని సిట్ అధికారులు చమత్కరించారు!
జోర్డాన్లో చేసిన షూటింగ్కి అయిన ఖర్చుల ప్రస్తావనే లేదంటే, బహుశా ఉచితంగానే అంతా చేయించుకున్నారో, లేక ఆ డబ్బులన్నీ నల్లగానే అక్కడే మాయమైపోయాయో అర్థం కాక సిట్ కూడా తల పట్టుకుందట!
తాడేపల్లి ప్యాలెస్ ముఠా ‘డబ్బు’ డ్రామాకు తెర!
మద్యం కుంభకోణంలో కుమ్మేసిన సొమ్మును.. వైకాపా ముఠా ముందు ‘నమ్మకస్తులైన’ కొందరికి చేరవేసి, తర్వాత వారి ద్వారా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి ‘అప్పు’ రూపంలో మళ్ళించిందట. అంటే, ‘అప్పు పుచ్చుకున్నట్టు’ డ్రామా ఆడి, కళ్ళకు గంతలు కట్టి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారన్నమాట. ఇది ఏ సినిమా కథకూ తీసిపోని ‘బ్లాక్ మనీ బ్లాక్బస్టర్’!
జగన్ అధికారంలో ఉన్నప్పుడే, 2020 డిసెంబరు 12న ఈ ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పుట్టుకొచ్చింది. అప్పట్లో పలువురు యువ దర్శకులకు అడ్వాన్సులు, కొత్త ప్రాజెక్టుల చర్చలు.. అంతా పీక్స్లో ఉన్నాయట. కానీ, ఎన్నికలు వచ్చి, జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణం దర్యాప్తు ఊపందుకోవడంతో.. కొత్త ప్రాజెక్టులన్నీ ‘హోల్డ్లో’ పడిపోయాయి.
ఇప్పుడు ‘మద్యం’ కథా చిత్రం నిజంగానే ‘మధ్యలో’ ఆగిపోయి, సిట్ దర్యాప్తుతో అసలు స్క్రిప్ట్ బయటపడింది! త్వరలో కోర్టులో ఈ ‘నల్లధన సినిమా’కి ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందో చూడాలి!
మరి ఈ ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుందా, లేక సీక్వెల్ ఉంటుందా? తప్పకుండా వుంటుంది తేనెతుట్టె కదిలింది కదా.
జగనే వచ్చి ఉంటే ఈ పాటికి టాలీవుడ్ తాడేపల్లి ప్యాలెస్ ముఠా చేతుల్లో పడి ముచ్చెమటలు పోసేది.