Suryaa.co.in

Telangana

ఎన్నికలప్పుడే ఆ పార్టీలకు జనం గుర్తుకొస్తారు

– నేను చేసిన అభివృద్ధి చూసి ఓటెయ్యండి
– మీ బిడ్డను మరోసారి ఆశీర్వదించండి
– కేసీఆర్‌ పాలనలోనే అభివృద్ధి
– ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలకు గుణపాఠం చెప్పండి
– సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి తలసాని పాదయాత్ర

ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు ప్రజలు గుర్తుకొస్తారని సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లో పాదయాత్ర ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మొదటిరోజు ప్రచారంలో బండిమెట్, మారుతివీది, నాలా బజార్, ఓల్డ్ జైల్ ఖానా తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ప్రచారం ప్రారంభం నుండి చివరి వరకు మంత్రికి అడుగడుగునా బ్రహ్మరధం పట్టారు. బతుకమ్మలు, డప్పు చప్పుళ్ళతో ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టి మంత్రికి నుదుటన తిలకం దిద్దారు. భవనాల పై నుండి మంత్రి పైకి పూలవర్షం కురిపించారు. ఆయన ను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. తమ సమస్యలు పరిష్కరించిన, తమ బతుకుల్లో వెలుగులు నింపిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తమ ఓటు కారు గుర్తుకే అని మద్దతు తెలిపారు.

పాదయాత్ర, ప్రచారంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లకు చెందిన కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అద్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ క్రింద ఆర్ధిక సహాయం అందిస్తూ తమ గౌరవాన్ని మరింత పెంచిందని పలువురు వృద్దులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్దిని 10 సంవత్సరాల కాలంలో చేశామని చెప్పారు. గతంలో ఇక్కడి నుండి గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసిన వారు సైతం చేయలేని అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో చేసినట్లు తెలిపారు.

అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్తను అభివృద్ధి చేశామని, త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించామని చెప్పారు. చేసిన అనేక అభివృద్ధి పనులు కండ్ల ముందే ఉన్నాయని, ముమ్మాటికి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చూపెడుతున్న ఆదరణ చూస్తుంటే భారీ మెజారిటీతో ఘన విజయం ఖాయమని అన్నారు.

వారిని ప్రజలు నమ్మరు…..మంత్రి తలసాని
కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాయమాటలతో ప్రజల వద్దకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీల ను ప్రజలు నమ్మబోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక్క చాన్స్ ఇవ్వమని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ 45 నుండి 50 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలని అన్నారు. అధికారంలో ఉన్ననాడే ప్రజలకు మేలు చేయలేనోళ్ళు ఇప్పుడు కొత్తగా గ్యారెంటీ, వారంటీ అంటూ కొత్త కొత్త పేర్లతో వస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్ని నిధులు తీసుకోచ్చారో చెప్పాలని అన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, మూడోసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని, హ్యాట్రిక్ సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపడతారని చెప్పారు.

ఈ ప్రచారంలో మంత్రి వెంట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, నామన శేషుకుమారి, కిరణ్మయి, డివిజన్ పార్టీ అద్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, జయరాజ్, ఓదెల సత్యనారాయణ, సంతోష్, కరుణాకర్ రెడ్డి, మహేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE