Suryaa.co.in

Andhra Pradesh

నాని…వెన్నుపోటు గురించి చెప్పే నువ్వు ..అప్పుడు ఎక్కడున్నావో చెప్పమంటావా?

– లక్ష్మీపార్వతిని స్టేజ్ మీద నుండి తోసేసావు కదా?
– నీతో తిరిగిన అడపా బాబ్జి సర్వం కోల్పోయారు
– నీ బంధువు అసిస్టెంట్ కమిషనర్ ను ఎస్సీ ఉద్యోగులపై ఎగదోశావు
– 20 ఏళ్లుగా గెలిపిస్తున్న గుడివాడ ప్రజలకు వెన్నుపోటు పొడిచావు
– నీతో పోటీ చేయడానికి చంద్రబాబు, లోకేష్ గుడివాడ రావాలా
– చంద్రబాబును ఒప్పిస్తా జగన్ రెడ్డిని పోటీ చేయిస్తావా
– అప్పుడు ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూసుకుందాం
– 2024 లో మళ్లీ నువ్వు కనబడితే అప్పుడడుగు
– మంచి మనిషిలా మారితే నీ ముఖమైనా చూస్తారు
– కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెనిగండ్ల

గుడివాడ, మే 28: కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పదే పదే చెప్పే వెన్నుపోటు జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నారని, ఆ తర్వాత ఏ పార్టీ నుండి పోటీ చేశారు, అప్పుడేం జరిగిందో నన్ను చెప్పమంటారా అంటూ టిడిపి నేత వెనిగండ్ల రాము నిలదీశారు. ఆదివారం గుడివాడలో వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు.

కొడాలి నాని మళ్లీ నోరు పారేసుకున్నారని, కంపుకొట్టే నోటితో పిచ్చి మాటలు మాట్లాడుతూ చిరాకు కలిగిస్తున్నారన్నారు. కొడాలి నాని మాటలు విన్నవారందరికీ చిరాకు పుట్టి మళ్లీ మొదలెట్టాడురా బాబూ, అనుకునే పరిస్థితికి వచ్చారన్నారు. మాటల్లో ఏమాత్రం కొత్తదనం ఉండదని, ఎప్పుడు చూసినా ఒకటే వాగుడు, ఒకటే కథ చెబుతూ వెన్నుపోటు అంటుంటాడన్నారు.

కొడాలి నాని చెప్పే వెన్నుపోటు జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత కొడాలి నాని ఏ పార్టీలోకి వచ్చారని, ఏ పార్టీ నుండి పోటీ చేశారో కూడా చెప్పాలన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కొడాలి నాని ఏం చేశాడో అందరికీ తెలుసని అన్నారు. లక్ష్మీపార్వతిని కుర్చీ నుండి లాగి స్టేజి మీద నుండి కిందికి తోసేసిన విషయం ఎవరికీ తెలియనిది కాదన్నారు. పదేపదే పనికిమాలిన సోది చెప్పిందే చెప్పుకుంటూ ఎన్నో ఏళ్లుగా పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు.

గుడివాడ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం, ప్రజలకు న్యాయం ఎలా చేయాలనే వాటి గురించి ఆలోచించాలని సూచించారు. కొడాలి నానిని నమ్మి ఆయన వెంట తిరిగిన అడపా బాబ్జి సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అడపా బాబ్జి బతికి ఉన్నప్పుడు గుడివాడ మున్సిపాలిటీలో ఆయనకు ఏ పనీ చేయవద్దని చెప్పలేదా అని కొడాలి నానిని ప్రశ్నించారు. కొడాలి నానిని బంధువుగా చెప్పుకుంటున్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తన కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ, ఎస్సీ ఉద్యోగులను కులం పేరుతో దూషిస్తున్నా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్నాడన్నారు.

గుడివాడ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. గత 20 ఏళ్లుగా గెలిపిస్తున్నా ఒక్క రోడ్డు కూడా వేయకపోవడం గుడివాడ ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా అని అన్నారు. నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కనుమరుగయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లేని పరిస్థితిని కల్పించారని, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం వల్ల ప్రజల్లో సహనం నశించి పోతోందని అన్నారు.

కొడాలి నాని మాట్లాడే ప్రతి మాట తనకు పనికి వచ్చేలా ఉందని ఎవరూ అనుకోవట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కొడాలి నానిపై పోటీ చేయడానికి చంద్రబాబు, లోకేష్ గుడివాడ రావాలా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్థాయి కొడాలి నానికి ఎప్పటికీ రాదని గుర్తు చేశారు. గుడివాడ నుండి పోటీ చేసేందుకు చంద్రబాబును ఒప్పిస్తానని, ఆయనపై జగన్ రెడ్డిని పోటీ చేయించాలని సవాల్ విసిరారు.

స్థాయికి మించి మాట్లాడవద్దని కొడాలి నానికి సూచించారు. గుడివాడ నుండి చంద్రబాబు పోటీ చేస్తే తనకు ఆనందమేనని, ఆయన వస్తే గుడివాడ అభివృద్ది, ప్రజలకు మేలు జరుగుతాయన్నారు. ముందు మంచిగా మాట్లాడడం, ప్రజలకు ఏం చేయాలో నేర్చుకోవాలని కొడాలి నానికి సూచించారు.

ఎంతసేపు సోది వాగుడు వాడడం మానేసి మంచి మనిషిలా మారాలని, అప్పుడు జనం నీ మొఖం చూడడానికి ఇష్టపడతారన్నారు. లేకపోతే 2024 తర్వాత నీ మొఖం చూడడానికి కూడా ఎవరూ ఉండరన్నారు. నీతో మాట్లాడటం కూడా దండగని వెనిగండ్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE