– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వలసదారుల బడుగు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధికి వారి జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు మద్దతుగా “మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ సంయుక్త కార్యచరణగా రూపొందించబడినది.
ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం ద్వారా నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్లుతున్న గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో మరియు తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత, సేవలు అందించబడతాయి.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి.గోపీ, FAO కు చెందిన అగ్రిబిజినెస్ స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి, IOM రాష్ట్ర సమన్వయకర్త జలజ, NWWT అధ్యక్షురాలు సిస్టర్ లిస్సీ జోసఫ్, ప్రాజెక్ట్ అమలు బృందం తదితరులు పాల్గొన్నారు. డా. గోపీ ఈ సంయుక్త కార్యక్రమ లక్ష్యాలను వివరించి, జిల్లాల స్థాయి అధికారులతో సమన్వయంగా శిక్షణలు నిర్వహించబోతున్నట్లు మంత్రికి తెలియజేశారు.
వలస సహాయ కేంద్రాన్ని ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ “ఈ వాహనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి, ఎంపిక చేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరిక్షలు, సేంద్రీయ వ్యవసాయ విధానాలపై, పశుపాలనపైన వర్చువల్ శిక్షణలు ఇవ్వాలి” అని సూచించారు. ఇకపై ఈ వాహనాల ద్వారా మొబైల్ మట్టి నమూనా పరీక్షలు మరియు పశుసేవల వంటి ఇతర సేవలు కూడా రైతులకు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. UN భాగస్వామ్య సంస్థల కృషిని మంత్రి ప్రశంసించారు.
ఇక వలస వెళ్ళిన కుటుంబాలలో మహిళలు తరచూ ఇంటిలో ఒంటరిగా మిగిలిపోతున్నారు. అటువంటి మహిళలకు గ్రామాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుంది. ఇది వారిని శక్తివంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.” అని మంత్రి అన్నారు.