– విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలి
– న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు – నాగమణి హత్య కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు, రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై ప్రజలలో పెరుగుతున్న అవిశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. ప్రజలు ఆశించినట్లుగానే, ఈ దారుణ హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, న్యాయం పట్ల నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది.
వామన్ రావు – నాగమణి దంపతులపై జరిగిన ఈ క్రూరమైన హత్య, రాష్ట్రంలో న్యాయవాదుల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమవుతాయన్న భయం, సాక్ష్యాలను మాయ చేయడం, ఒత్తిళ్లతో కేసును బలహీనపరచే ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి.
సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలను వెలికితీసి, దోషులకు చట్టపరమైన కఠిన శిక్షలు విధించడానికి కృషి చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ కేసు, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలవాలి. అదేవిధంగా, ఈ తీర్పు దేశవ్యాప్తంగా న్యాయం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒక మైలురాయి అవుతుందని విశ్వసిస్తున్నాం.
గతంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే, న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేశాను. ఈ అంశంపై శాసన మండలిలో పునరావృతంగా మాట్లాడాను. కానీ అప్పటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటికైనా నెరవేర్చాలి.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. న్యాయవాదులపై దాడులు, హత్యలు ఆగాలంటే ఈ చట్టం తప్పనిసరిగా అమల్లోకి రావాలి.
వామన్ రావు దంపతుల హత్య వంటి ఘోర సంఘటనలు మళ్లీ జరగకుండా, న్యాయవాదుల భద్రతను కాపాడే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. న్యాయం జరిగే వరకు, న్యాయవాదుల గౌరవం, భద్రత కోసం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తుంది.