Suryaa.co.in

Andhra Pradesh

మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతాం

  • అబ్కారీ శాఖలో జగన్ రెడ్డి అక్రమాల్నీ నిగ్గు తేలుస్తాం
  • నిషేధం పేరుతో ఓట్లేయించుకుని పచ్చి మద్యంతో జేబులు నింపుకున్నారు
  • జగన్ రెడ్డి నిర్ణయంతో తెలంగాణ మద్యం ఆదాయం పెరిగింది
  • డిస్టిలరీలన్నీ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు
  • నగదు లావాదేవీల ద్వారా వేల కోట్ల ప్రజా ధనం జగన్ ఖజానాకు చేరింది
  • జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

అమరావతి : జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్రంలోని మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతామని గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గత ఐదేళ్ల పాలనలో మద్యం డిస్టిలరీల కేటాయింపు నుండి అమ్మకాల వరకు అనేక చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే శ్వేత పత్రం ద్వారా బయటపెట్టామన్నారు. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని వారి నెత్తిన రుద్దారన్నారు. అప్పట వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్లను తొలగించి పిచ్చి బ్రాండ్లుతెచ్చారు. వాటిని తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ, లివర్ సమస్యలతో వేలాది మంది ఆస్పత్రుల్లో చేరారు.

బీర్ అమ్మకాలు తగ్గించి గంజాయి అమ్మకాలు పెంచారు

మరోవైపు బీర్ అమ్మకాలను సైతం దెబ్బతీశారన్నారు. యునైటెడ్ బేవరేజెస్, హరిక్లోస్ బేవరీస్, ఎస్ఆర్‌జే బేవరేజెస్ లాంటి సమస్థల్ని పూర్తిగా మూయించేశారు. బీర్ ధరల్ని పెంచి, అమ్మకాలను తగ్గించారు. అదే సమయంలో గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చి యువత జీవితాలను ఛిద్రం చేశారు. ప్రతి కిల్లీ కొట్టులో కూడా గంజాయి సరఫరా చేసి యువత జీవితాలను నాశనం చేసి, వారి కుటుంబాలను రోడ్డున పడేసి, నేరాల పెరుగుదలకు కారణమయ్యారు.

కల్తీ సారాతో ప్రజల ప్రాణాలు తీశారు

గత ప్రభుత్వ హయాంలో ఉండే డిస్టిలరీలన్నింటినీ కబ్జా చేసి కల్తీ బ్రాండ్లు తీసుకొచ్చారు. వారు చెప్పిన బ్రాండ్లను త్రమే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేలా ఆదేశాలిచ్చారు. ప్రతిపక్ష నేతగా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక తన జేబులు నింపుకోవడం కోసం దశల వారీ నిషేధం అంటూ తానే మద్యం అమ్మకాలు చేపట్టారు. రేట్లు పెంచితే మద్యం తాగడం తగ్గిస్తామని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. ధరలు పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా నాటు సారా, గంజాయి వైపు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 20 మంది ప్రాణాలొదిలారు. ఈ మరణాలకు కారణం జగన్ రెడ్డే. ఈ ఘటనలన్నింటిపై విచారణ జరిపిస్తాం. వ్యవస్థల్ని నాశనం చేసేలా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా సమీక్సిస్తాం. కిల్లీ కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి. కానీ వేల కోట్ల వ్యాపారం జరిగే మద్యంలో మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేకుండా దాదాపు రూ.90 వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. జగన్ రెడ్డి తన జేబులు నింపుకోవడం కోసం వేల మంది ప్రాణాలు తీశాడని ధ్వజమెత్తారు.

జగన్ రెడ్డి మద్యం దందాపై సమగ్ర విచారణ చేయిస్తాం

జగన్ రెడ్డి పాలనలో జరిన మద్యం అక్రమాలపై సమగ్ర విచారణ చేయించబోతున్నాం. సీబీ సీఐడీ ద్వారా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తాం. అవసరమైతే ఈడీ విచారణకు కూడా ఆదేశిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీలో అమలు చేసిన పిచ్చి మద్యం బ్రాండ్ల కారణంగా  తెలంగాణ ఆదాయం గత ఐదేళ్లలో రూ.42 వేలు ఏపీ కంటే ఎక్కువ ఉంది. కారణం ఇక్కడ కల్తీ బ్రాండ్లు ఉండగా అక్కడ మెరుగైన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్లలో దాదాపు రూ.19 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. త్వరలోనే సమగ్ర విచారణతో మొత్తం అక్రమాలను బయట పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలోనే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి చూపిస్తామని గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.

LEAVE A RESPONSE