– ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తం
– చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక
– రేపు అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. మీకు ఏమాత్రం సహకరించం.
– మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాఖ్య
– జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి మా మీద ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవర్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చానా ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదు.
అంతకు అంత అనుభవిస్తారు. జాగ్రత్త ఆలోచించుకోండి. రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టం రేపు అధికారంలోకి వచ్చే బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే చట్టబద్దంగా న్యాయబద్దంగా వ్యవహరించండి.
దావోస్ నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్ లో కాదు, చట్ట ప్రకారం వ్యవహరించండి. తప్పుడు సూచనలు, తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం.
కుట్రలతో బిఆర్ఎస్ నాయకులను బెదిరించాలని చూస్తున్న రేవంత్ పన్నాగం ఇది. మేం తప్పు చేయలేదు, ఎవరికి భయపడేది లేదు. కేటీఆర్ దైర్యంగా వెళ్లారు. అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగింది. ఆరోజు ఎందుకు కేసులు పెట్టలేదు?.మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్థుల రాయిస్తే ఏం చేశారు?. రేవంత్ రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలి. అన్ని విషయాలు బయటకు రావాలి.