Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట

– బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమరావతి : బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోడానికి చర్యలు చేపట్టిందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
బుధవారం వారం ఆమె విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే పథకాలు అమలు చేస్తున్నారు…వాటి వల్ల ఎంతమందికి లబ్ధి కలుగుతుంది అని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న భూములు, ఆస్తులు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బ్రాహ్మణుల సంక్షేమానికి మొదటి నుంచి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు. బ్రాహ్మణుల్లో ఉన్న పేదరిక నిర్మూలనకు బ్రాహ్మణ కార్పొరేషన్ ను 2014లో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారన్నారు.

ఆ కార్పొరేషన్ కింద ఎన్నో పథకాలను అమలు చేస్తూ, బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కల్పనకు కృషి చేశారన్నారు. 2014-19లో భారతి, భారతీ విదేశీ విద్య, గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణమస్తు, కశ్యప, గరుడ వంటి పది పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

జగన్ వచ్చిన తరవాత చంద్రబాబునాయుడు అమలు చేసిన పథకాన్నింటినీ నిలిపేశారన్నారు. అన్ని వర్గాల మాదిరిలాగనే నవరత్నాల పేరుతో బ్రాహ్మణులను నట్టేటముంచారన్నారు. మరోసారి సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడంతో బ్రాహ్మణులకు మంచిరోజులు ప్రారంభమయ్యాన్నారు. బ్రాహ్మణుల అవస్థలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి 2014-19 నాటి పథకాలను మరోసారి అమలు చేసేలా కృషి చేస్తామన్నారు.

పాత పథకాలతో కొత్త పథకాలను కూడా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

అర్చకుల వేతనం పెంపు హామీని నెరవేర్చుకున్న చంద్రబాబు
బ్రాహ్మణులకు ఎన్నిల్లో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు అమలు చేశారని మంత్రి సవిత వెల్లడించారు. ఆదాయం లేని ఆలయాలకు ధూప, దీప నైవేద్యం పథకాన్ని 2014-19లో సీఎం చంద్రబాబునాయుడు అమలు చేశారని గుర్తుచేశారు.

అప్పట్లో అర్చకులకు రూ.3 వేల గౌరవ వేతనంతో పాటు దూప దీపాల కోసం మరో రూ.2 వేల ఇచ్చేవారన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అర్చకుల గౌరవ వేతనం రూ.7 వేలకు, దూప దీపాల కోసం రూ.3 వేలకు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేశారన్నారు. దీనికోసం ఏడాదికి ప్రభుత్వంపై రూ.32.40 కోట్ల భారం పడనుందని మంత్ర సవిత వెల్లడించారు.

భూములను, ఆస్తులను పరిరక్షించండి
రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో భూములను, ఆస్తులను పరిరక్షించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. ఇందుకుగానూ జిల్లా కేంద్రాలు, నగర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ భూముల్లో కమర్షియల్ భవనాలు నిర్మించి, అద్దెలకు ఇస్తూ ఆదాయం ఆర్జించ వచ్చునన్నారు.

వివాదాల్లో భూముల సమస్యలు పరిష్కరించి, స్వాధీనం చేసుకోవాలని అధికారులకు మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండీ ఎం.మహేశ్వరరెడ్డి, జీఎం నాగసాయి, అసిస్టెంట్ కమిషనర్ సుభ్రద తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE