– ఇన్నాళ్లూ స్థానికుల ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదు?
– అసలక్కడ 108 అంబులెన్స్ ఎందుకుంది?
– ప్రభుత్వ పెద్దలు తక్షణం సమాధానం చెప్పాలి
: వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్
తాడేపల్లి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలోని పోతవరప్పాడు శివారులో ఉన్న మ్యాంగో రిక్రియేషన్ క్లబ్ లో పేకాట ఆడిస్తున్న మంత్రి ఎవరు? ఏడాదిన్నరగా యథేచ్ఛగా పేకాట శిబిరం నడుస్తుందని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల దాడుల్లో కోట్ల కొద్దీ నగదు దొరకడంతోపాటు 120 కి పైగా కార్లు, 50 కి పైగా బైకులను పోలీసులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తున్నా మీడియాలో దీనికి సంబంధించి ఒక్క వార్త కూడా రాకపోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల అండదండలతోనే పేకాట శిబిరం నడుస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పారు.
గోవా తరహాలో టోకెన్ సిస్టం పెట్టి క్లబ్బును రూ. 10 వేలు, రూ. 50 వేలు, రూ. లక్ష, రూ.5 లక్షల జోన్లుగా విభిజించి పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి జూదగాళ్లను పిలిపించి మరీ పేకాట ఆడిస్తున్నారని, జూదగాళ్లను ఆకర్షించడానికి అధిక మొత్తంలో అప్పులు కూడా ఇస్తున్నారని శివశంకర్ వివరించారు. క్లబ్బుపై దాడులు చేయడానికి వచ్చిన పోలీసులను క్లబ్బు నిర్వాహకులు బెదిరించారని, హైకోర్టు అనుమతులతోనే ఈ జూదశాలను నిర్వహిస్తున్నట్టు చెప్పుకోవడంతో పాటు, పబ్లిక్ గా బోర్డు కూడా ఏర్పాటు చేయడం అంటే న్యాయస్థానాలను కూడా వాడుకోవడం కాదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే పక్కనే డాక్టర్లు, ఇంజినీర్లు నివసిస్తూ దీనిపై ఫిర్యాదు చేసినా ఇన్నాళ్లూ పోలీసులు పట్టించుకోలేదని శివశంకర్ స్పష్టంచేశారు. నూజివీడు నియోజకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పార్థసారథితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే పేకాట క్లబ్బులోకి మీడియాను అనుమతించి పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ నాయకుల వివరాలను మీడియా ముందుంచాలన్నారు.
అసలక్కడ 108 అంబులెన్స్ ఎందుకు ఉందొ చెప్పాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా నడుస్తున్న పేకాట క్లబ్బులపై దాడులు నిర్వహించి మూసేయించాలని, లేదంటే వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని శివశంకర్ హెచ్చరించారు.