ఈమె పేరు ఎలిజబెత్ కోలోబోర్న్..! బ్రిటిష్ దేశస్థురాలు… అస్సాంకు చెందిన ఎంపీ గౌరవ్ గగోయ్ భార్య… లోకసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్… అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు… మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కొడుకు… మరి ఆమెను అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఎందుకు వేటాడుతున్నాడు..? ఓసారి వివరాల్లోకి వెళ్దాం…
ఆమె వాతావరణ మార్పులు (Climate Change), అభివృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ సంస్థలలో పనిచేసింది… ముఖ్యంగా LEAD (Leadership for Environment and Development), CDKN (Climate and Development Knowledge Network) వంటి సంస్థల్లో కీలక పాత్రలు పోషించింది…
పాకిస్థాన్లో కూడా పనిచేసింది… గౌరవ్ గగోయ్ కూడా అమెరికాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు, సామాజిక అభివృద్ధి రంగంలో చురుగ్గా ఉండేవాడు… ఇద్దరికీ సామాజిక అంశాలు, పర్యావరణంపై ఉన్న ఆసక్తి వారిని దగ్గర చేసిందని బయటికి చెప్పుకుంటారు, కానీ ఇద్దరూ కలిసి చదవలేదు, కలిసి పనిచేయలేదు… మరి ఎక్కడ పరిచయం, ప్రణయం పరిణయం దాకా వచ్చిందో తెలియదు…
వివాహం 2013, అక్టోబర్ 23న ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది… అస్సామీ సంప్రదాయం ప్రకారం (Ahom ‘Chaklong’ ceremony) వివాహ వేడుకలు జరిగాయి… అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి అగ్రనేతలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు… తరువాత వీళ్లకు ఇద్దరు పిల్లలు… కుమారుడు కబీర్, కుమార్తె మాయ…
కొన్నాళ్ల క్రితం అస్సాం ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది… ఎలిజబెత్కూ పాకిస్థానీ ఐఎస్ఐకూ ఉన్న సంబంధాలు, గౌరవ్ రహస్య పాకిస్థాన్ పర్యటనలతోపాటు ఆమె, తన పిల్లల పౌరసత్వాలపై విచారణ…
ఆ సిట్ నివేదిక వివరాలను సాక్షాత్తూ హిమంత విశ్వ శర్మ ప్రెస్మీట్లో వెల్లడించాడు… తనేమంటాడంటే..?
‘‘గౌరవ్ గగోయ్ దంపతులకు పాకిస్థాన్కు చెందిన అలీ తౌకీర్ షేక్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు “షాకింగ్” ఆధారాలు లభించాయి… ఎలిజబెత్ కోల్బోర్న్ భారత నిఘా విభాగం (IB)కి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని (ముఖ్యంగా పర్యావరణ, వాతావరణ మార్పుల అంశాలపై) 45 పేజీల నివేదిక రూపంలో అలీ తౌకీర్ షేక్కు పంపింది…
ఆమెకు పాకిస్థాన్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి… వాటిని గౌరవ్ తన ఎన్నికల అఫిడవిట్లో దాచాడు… ఆరోపిస్తున్నారు.
ఆమె గతంలో పాకిస్థాన్లో పనిచేసిందనీ, భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఆమెకు పాకిస్థానీ మూలాల నుండి జీతం చెల్లించబడింది… ఇది FCRA నిబంధనల ఉల్లంఘన … గౌరవ్ గగోయ్ 2013లో 10 రోజుల పాటు రహస్యంగా పాకిస్థాన్లో పర్యటించాడు… ఈ కేసులో అంతర్జాతీయ కోణాలు, జాతీయ భద్రత ముడిపడి ఉన్నందున, అస్సాం కేబినెట్ ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు (MHA) బదిలీ చేయాలని నిర్ణయించింది… కేంద్ర ఏజెన్సీల ద్వారా సమగ్ర విచారణ జరిపించాలి…’’
ఈ ఆరోపణలపై గౌరవ్ గగోయ్ స్పందిస్తూ, ఇవన్నీ తనపై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలని, ఇదంతా ఓ సీ గ్రేడ్ సినిమాలాగా ఉందనీ కొట్టిపారేశాడు… సహజంగా ఏ పొలిటిషియనైనా అదే కదా చెప్పేది…
ప్రస్తుత స్థితి… అస్సాం ప్రభుత్వం ఈ కేసును అధికారికంగా కేంద్ర హోం శాఖకు సిఫార్సు చేసింది… ఎలిజబెత్ కోల్బోర్న్ OCI (Overseas Citizenship of India) హోదాను రద్దు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది…
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? విదేశీయులు భారతీయుడిని వివాహం చేసుకుంటే 7 ఏళ్ల నివాసం తర్వాత భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు… 2013లో వివాహం జరిగినప్పటికీ, ఇప్పటికీ ఆమె బ్రిటిష్ పౌరసత్వంతో (UK Citizen) కొనసాగుతూ, కేవలం OCI (Overseas Citizen of India) కార్డుతోనే ఎందుకు ఉంటున్నది… గౌరవ్ తన కుమారుడి భారతీయ పాస్పోర్ట్ను సరెండర్ చేసి, అతనికి బ్రిటిష్ పౌరసత్వం ఎందుకు తీసుకున్నాడు… తన కుమార్తెకు పుట్టినప్పటి నుంచే బ్రిటిష్ పాస్పోర్ట్ ఎందుకు కొనసాగుతోంది?
– యన్ ఎస్ కె చక్రవర్తి