Suryaa.co.in

Andhra Pradesh

వై నాట్ ఆంధ్రప్రదేశ్… కాంగ్రెస్ దే అధికారం

-ఎన్నికల ప్రచారానికి.. ఖర్గే, రాహుల్, ప్రియాంకతో పాటు రేవంత్, సిద్ది రామయ్యలు
-మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలి…
-నయా జోష్ తో… పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
-ఏపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు
-కర్ణాటక, తెలంగాణ విజయాలతో ఆంధ్రాపై ప్రత్యేక దృష్టి
– ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: మొన్న కర్ణాటక, నిన్న హైదరాబాద్ వరుస విజయాలతో దక్షిణాదిలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఇందులో భాగంగానే వై నాట్ ఆంధ్రప్రదేశ్.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటూ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో పబ్లిక్ మేనిఫేస్టోతో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ పెద్దలు, ఏపీసీసీ నేతలతో విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో మూడు రోజులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు బుధవారం పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నేత్రుత్వంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ & కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.

అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. భవిష్యత్ కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మెయప్పన్, క్రిష్టోఫర్ తిలక్, సీడ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కొప్పుల రాజు, పల్లం రాజు, చింతా మోహన్, జేడీ శీలం, మాజీ మంత్రి బాపిరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శిరివెళ్ల ప్రసాద్, కార్యనిర్వహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మ శ్రీ, రాకేష్ రెడ్డితో పాటు ఎన్ ఎస్ యు ఐ, మహిళా కాంగ్రెస్, సేవా దళ్, యూత్ కాంగ్రెస్, పలు విభాగాల నేతలు పాల్గొన్న ఈ సమావేశం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

వారం రోజుల క్రితం హఠాత్తుగా మరణించిన జనరల్ సెక్రెటరీ జక్కా శ్రీనివాస్ కి ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం… సమావేశం సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకునే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి ఈ నెల 9వ తేదీకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏడాది యాక్టివిటీ రిపోర్ట్ తో పాటు ఏఐసీసీ తీర్మానాలను తెలుగులో అచ్చు వేయించి ముఖ్య నేతలకు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ మీటింగ్ అని, రాజకీయంగా ఏ విధంగా ఎన్నికలకు వెళ్లాలో ఈ సమావేశాల్లోనే నిర్ణయిస్తామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలతోనే తాము ప్రజల్లోకి వెళ్తామని అదే తమ ప్రధాన అజెండా అని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తేల్చి చెప్పారు.

త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో.. రాష్ట్రం నుంచి ప్రధాన నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లి ముఖ్య నేతలతో ఎన్నికల వ్యవహారాలపై చర్చించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం, వెనకబడిన ప్రాంతాలకు నిధుల వంటివి తమ ప్రధాన ఎజెండాలో భాగమన్నారు. ప్రస్తుత మూడు రోజుల సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా, నగర స్థాయి కాంగ్రెస్ అధ్యక్షులు నేతలకు పంపుతామని పేర్కొన్నారు. అదే విధంగా ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలకు సంబంధించి ఏఐసీసీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.

స్థానిక సమస్యలు ప్రధాన అంశంగా స్థానిక మేనిఫేస్టోతో ప్రజల్లోకి వెళ్తామని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగా.. ప్రతి జిల్లా స్థాయిలో ఆ జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా మేనిఫేస్టోలను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమాచారం అంతా ఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసీసీ పెద్దల ద్రుష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అదే విధంగా రాబోయే ఎన్నికల ప్రచారానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిధ్దిరామయ్యతో పాటు ఇతర ఏఐసీసీ నేతలు కీలక పాత్ర పోషిస్తారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెళ‌్లడించారు. వై నాట్ ఆంధ్రప్రదేశ్ అన్న పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు… మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అంటూ… రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించి, ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.

రాహుల్ గాంధీ స్పూర్తితో చేరికలు….
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్పూర్తితో విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బాబు మెండెం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాబు మెండెంతో పాటు రాకేష్, అజయ్, సాగర్, రవితో పాటు 15 మందికి పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో cwc సభ్యులు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు కొప్పుల రాజు, జేడీ శీలం పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE