Suryaa.co.in

Andhra Pradesh

విషపు మద్యాన్ని అమ్ముతున్నట్లు ప్రభుత్వం ఒప్పుకుంది

– రిపోర్టులు రాకుండానే ఎస్పీ ప్రభుత్వ మద్యాన్ని వెనకేసుకురావడం ఏంటి?
– ఎస్పీ ఈ విధంగా మాట్లాడితే, ల్యాబ్ రిపోర్టులు పారదర్శకంగా వస్తాయా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు

బాపట్లజిల్లా, రేపల్లె మండలం, పోటుమెరక గ్రామంలో జగన్ రెడ్డి అమ్మతున్న విషపుమద్యం తాగి ఇద్దరు చనిపోయిన విషయం రాష్ట్రమంతా తెలుసు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అమ్ముతున్న మద్యం పూర్తిగా విషపూరితమని, వాటిలో విష రసాయనాలున్నాయని అనేక మార్లు టీడీపీ రుజువుచేసింది. టీడీపీ వాటిని ల్యాబ్ లలో పరీక్షలు చేయించి విషం ఉందని, లేవని రుజువు చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరింది.

దీనిపై ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి సవాల్ ను స్వీకరించి రుజువుచేయలేదు. దీంతో విషపు మద్యాన్ని తాము అమ్ముతున్నట్లు ప్రభుత్వం ఒప్పుకుంది. ఒక్కరైనా ప్రభుత్వం నుండి ముందుకు రాని పరిస్థితి. రాష్ట్రంలో ప్రతిరోజూ విషపు మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. జగన్ రెడ్డి ఈ విషపు మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలు ఎక్కడున్నాయి, ఎవరికి సంబంధించినవి, ఎన్ని ఉన్నాయి? అనే విషయాన్ని కూడా టీడీపీ ఇంతకుముందే రుజువుచేసింది. రేపల్లెలో నేడు జరిగిన సంఘటనకు ఎవరు బాధ్యతవహిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి.

జగన్ రెడ్డి రాజకీయంగా ఎదగాలంటే కుటుంబ హత్యలు చేయాలా? రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే విషపూరిత మద్యాన్ని ప్రజలతో తాగించి, వాటితో వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపే పరిస్థితికి దిగజారారు. విషపుమద్యం తాగి చనిపోయిన కుటుంబాలను పరామర్శిండానికి వెళుతున్న టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తున్నారు. రాష్ట్రంలోని పోలీసులు ఉన్నది ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి, అక్రమ అరెస్టులు చేయడానికా, హత్యలు, అత్యాచారాలు చేసిన దోషులను అరెస్టు చేయడానికా?

వైసీపీ ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, నేరాలకు పాల్పడిన దోషులను అరెస్టు చేయడం లేదు. కల్తీ మద్యం, విషపూరిత మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని పోలీసులు అరెస్టు చేయడం లేదు. డిస్టిలరీలను మూతు వేయడం లేదు. మీరే విషపు మద్యాన్ని తయారు చేసి మీ కార్యకర్తలతో ప్రభుత్వ దుకాణాలతో అమ్ముతున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ నిన్నటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ విషపు మద్యం తాగి వాళ్లు చనిపోలేదు, కేవలం అనారోగ్యంతోనే చనిపోయారని చెప్పారు. కేవలం ప్రతిపక్షంపై అపనిందలు వేసే విధంగా ఎస్పీ మాట్లాడుతున్నారు.

ప్రతిపక్షాలు విషం లేని మద్యాన్ని విషం ఉందని ప్రచారం చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ మద్యాన్ని ల్యాబ్ లకు పంపుతున్నాం, వాటిపై రిపోర్టులు వచ్చాక అసలు విషయాలు చెబుతామని ఎస్పీ చెబుతున్నారు. రిపోర్టులు రాకుండానే ఎస్పీ ప్రభుత్వ మద్యాన్ని వెనకేసుకురావడం ఏంటి? బాధ్యత గల ఎస్పీ ఈ విధంగా మాట్లాడితే, ల్యాబ్ రిపోర్టులు పారదర్శకంగా వస్తాయా? బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా? రాష్ట్ర ప్రజల ప్రాణాలు నిలబడతాయా? జగన్ రెడ్డి ఏపీలోని మందుబాబుల జీవితాలో ఆడుకుంటూ, ఆడబిడ్డల తాళిబొట్టులు తెంచుతూ వస్తున్న ఆదాయంతో రానున్న ఎన్నికలకు నిధులు కూడబెట్టుకుంటున్నారు.

పోలీసులు సొంత పెత్తనం చేయకుండా, అత్యుత్సాహం చూపకుండా ఉంటే మంచిది. రేపల్లెలో చనిపోయిన నాంచారయ్య, పెదరత్తయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. జగన్ రెడ్డి బినామీల డిస్టిలరీలో తయారవుతున్న మద్యం పూర్తిగా విషరసాయనాలతో నిండి ఉన్నాయి. ఈ మరణాలకు జగన్ రెడ్డే కారణం. పోలీసులు ప్రతిపక్షాలపై పెట్టిన నిఘా, చొరవ, అత్యుత్సాహం, దోషులను పట్టుకునే విషయంలో చూపించాలి. విషపు మద్యాన్ని అరికట్టడంలో చూపించాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE