Suryaa.co.in

Andhra Pradesh

భూమిని వైసీపీ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు…

– ప్రజాదర్బార్’ లో ఓ బాధితుడి మొర
– సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి
– అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు

అమరావతి: ప్రజాదర్బాకు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపడంతో పాటు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ 43వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను ఏకరవు పెట్టారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

– కారు డ్రైవర్ గా పనిచేస్తున్న తన ఏకైక కుమారుడిని తోటి డ్రైవర్లు కలిసి హత్య చేశారని, విచారించి నిందితులను శిక్షించాలని ఉండవల్లికి చెందిన ఏపూరి వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి ఆధారమైన కుమారుడిని కోల్పోవడంతో అనారోగ్యానికి గురయ్యాయని, పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
– అనారోగ్యంతో భర్త మరణించడంతో తన ఇద్దరి పిల్లల పోషణ భారంగా మారిందని, ఇల్లు మంజూరు చేయడంతో పాటు స్వయం ఉపాధి కల్పించి ఆదుకోవాలని నులకపేటకు చెందిన కొండ సుశీల కోరారు.
– అమరావతి రాజధాని పరిధిలో గత 50 ఏళ్లు వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, గత ప్రభుత్వం రాజధాని రైతు కూలీ పెన్షన్ నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని ఉండవల్లికి చెందిన పెయ్యాల శ్రీరామమూర్తి, భూపతిరాజు సత్యనారాయణ రాజు విజ్ఞప్తి చేశారు.
– ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన తమ భూమికి వార్షిక కౌలు అందడం లేదని, విచారించి కౌలు మంజూరుయ్యేలా చర్యలు తీసుకోవాలని నిడమర్రుకు చెందిన చల్లా పెద్ద అంకమరావు విజ్ఞప్తి చేశారు.
– బీ.కామ్ కంప్యూటర్స్ చదివిన తనకు ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ మహమ్మద్ రఫి కోరారు. పరిశీలించి తగిన ఉద్యోగం కల్పిస్తామని మంత్రి అర్జీదారులకు హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

– తమ కుటుంబానికి వారసత్వంగా సంక్రమించిన 5.48 ఎకరాల అసైన్డ్ భూమిని వైసీపీ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని.. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఇచ్చి సొమ్ము చేసుకున్నారని గుంటూరు జిల్లా ఓబులనాయుడు పాలెంకు చెందిన సిద్దెల కిరణ్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలైన కేశం హరినాథ్, దుగ్గెంపూడి అంజిరెడ్డి, వీఆర్ఏ పొత్తూరు పద్మ, పొత్తూరు భాగ్యరాజులు తమను నమ్మించి మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. నిషేధిత జాబితా నుంచి తమ పొలాన్ని తొలగిస్తామని చెప్పి తమ వద్ద రూ.3 లక్షల నగదు, 50 గ్రాముల బంగారాన్ని లంచంగా తీసుకోవడంతో పాటు అనంతరం మాయమాటలు చెప్పి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని జగనన్న కాలనీలకు ఇచ్చి తమకు అన్యాయం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
– ఇటీవల సంభవించిన వరదల్లో తన ట్యాక్సీ మునిగి పూర్తిగా పాడైపోయిందని, మరమ్మతులకు తగిన ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం హనుమంతపురానికి చెందిన కొడాలి కరుణాకర్ బాబు విజ్ఞప్తి చేశారు. కారుకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వాపోయారు.
– రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న టీఏ, డీఈవో, హెల్పర్స్ ల కాంట్రాక్ట్ కాలపరిమితి 11 నెలలకు రెన్యువల్ చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
– డిగ్రీ చదివిన తన దివ్యాంగ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని గుంటూరు శ్రీనగర్ కు చెందిన బొంతల శ్రీనివాసరావు కోరారు.
– క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా మందడంకు చెందిన పిల్లపాగ రోశమ్మ విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE