వైసీపీ మైనార్టీ శాసనసభ్యులు మైనార్టీ ద్రోహులు

-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్

వైసీపీ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కోతలు పెట్టింది. నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు వాతలు పెట్టింది. 2020లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో జగన్.. దుల్హన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ కూడా ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మొత్తం డబ్బులు చెల్లిస్తామని చెప్పి మొండిచేయి చూపారు. వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. మైనార్టీ సోదరీమణులు పెళ్లిళ్లు అయిపోయినప్పటికీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్నవారికి ఇవ్వాల్సిన రూ.50వేలు ఇవ్వలేదు.ఈ మూడు సంవత్సరాల కాలంలో దుల్హన్ పథకం కింద దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రలో ఇచ్చిన వాగ్దానాలకు తూట్లు పొడిచారు.

మైనార్టీల అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు పెట్టిన విదేశీ విద్య పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. జగన్… దుల్హన్ పథకాన్ని రూ.లక్షకు పెంచుతానని ముస్లీం మైనార్టీలను నమ్మించి మోసం చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ శాసనసభ్యులు భవిష్యత్తులో మైనార్టీ ద్రోహులుగా మిగిలిపోతారు. సంక్షేమ పథకాలు యావత్తును కూడా పూర్తి స్థాయిలో అమలుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. మైనార్టీ సోదర, సోదరీమణులకు ఒక అన్నగా అండగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి. వారిపట్ల ద్రోహిగా మారాడు. మేనిఫెస్టోను ఒక ఖురాన్, ఒక బైబిల్ గా పాటిస్తానని చెప్పిన జగన్.. నేడు మాట మార్చి మడమ తిప్పాడు. చేతకాని పాలనతో మైనార్టీలను నట్టేట ముంచాడు. ప్రతి మైనార్టీ సోదర, సోదరీమణి జగన్ ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కంకణం కట్టుకోవాలి. మైనార్టీలందరూ ఒకేమాట, ఒకేబాట, ఒకే ఆలోచనతో ముందుకెళ్లాలి. దుల్హన్, విదేశీ విద్య పథకాల రద్దుతోపాటు మౌజన్, ఇమాంలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయడంలేదు. హజ్ యాత్రకు సంబంధించిన ఎంబార్ కేషన్ గన్నవరంలో పెట్టలేకపోయారు. ముస్లింలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను ప్రతి ఒక్కరు నిలదీయాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు.

Leave a Reply