Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

  • వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
  • భూముల సమస్యలపైనే అత్యధిక అర్జీలు

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

వీటిల్లో అత్యధిక భాగం గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన భూ అక్రమణలు, అక్రమాలకు సంబంధించిన వినతులే ఉన్నాయి. తమ భూములను ఆక్రమించుకున్నారంటూ పేదలు, మహిళలు, ముసలివారు పెద్ద సంఖ్యలో వచ్చి వినతలు ఇచ్చారు. అలాగే తమ భూములను 22ఏ కింద చేర్చి అసైన్డ్ భూములు అంటున్నారని, తమకు న్యాయం చేయాలని మరికొంత మంది కోరారు.

గ్రామ సహయకుల సంఘం ప్రతినిధులు మంత్రి అనగానిని కలిసి గత వైసీపీ ప్రభుత్వం తమకొస్తున్న డీ ఏను తొలగించిందని, అంతేకాక చెల్లించిన మొత్తాలను కూడా రికవరీ చేసిందని, తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యా, విద్యుత్, ఇతర శాఖలకు సంబంధించి కూడా వినతులు వచ్చాయి.

మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని వినతులను స్వీకరించి శాఖల వారీగా విభజించి ఆయా సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఠాపురంలో తనకున్న 4 సెంట్ల భూమిని వైసీపీ నేత ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసి ఇబ్బందులు పెడుతున్నారని రేపల్లే నియోజకవర్గం గూడవల్లికి చెందిన జి.వాణీశ్రీ చెప్పారు.

తన తల్లితండ్రులు తనకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 33 సెంట్ల స్థలం పైన వైసీపీ నేతల కన్నులు పడ్డాయని, ఆ భూమిని చౌకగా కొట్టేసేందుకు తనను అమ్ముకోనివ్వకుండా గత ఏడాది కాలం నుండి ఇబ్బందులు పెడుతున్నారని మాచర్లకు చెందిన బత్తుల లక్ష్మీ చెప్పారు. రేపల్లేలో తన పేరు మీద ఉన్న స్థలం, రెండస్థుల ఇళ్లు అసైన్ ల్యాండ్ జాబితాలో చేర్చారని, కానీ తాను 20 ఏళ్ల పై నుండి ఈ ఆస్థికి అన్ని రకాల పన్నులు కడుతున్నానని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, తనకు న్యాయం చేయాలని రెపల్లేకు చెందిన భారతీ మంత్రి అనగానిని కోరారు.

ఇలా బుధవారం వచ్చిన అర్జీల్లో 90 శాతం వరకు భూములకు సంబంధించిన సమస్యల వినతులే వచ్చాయి. వీటన్నింటికీ అధికారులకు పంపించి పరిష్కారం చూపిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అర్జీదారులకు హామీనిచ్చారు.

LEAVE A RESPONSE