Suryaa.co.in

Andhra Pradesh

ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు

అమరావతి :– ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందని, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందన్నారు. దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై, అధికార పార్టీకి కొమ్మకాస్తున్న కొందరు పోలీసుల అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలన్నారు. మోహన్ రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE