– ₹5 లక్షల కోట్ల భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనం ఆమోదానికి సంకేతం
– రాహుల్ గాంధీ స్పందించకుంటే 5 లక్షల కోట్ల అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్నట్లే
– ఐదు లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని కాంగ్రెస్ కి ఏటీఎంగా మారుస్తామంటే ఒప్పుకోము
– లక్షల కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించిన కేటీఆర్
– రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP) ను ఆయన “స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి”గా అభివర్ణించారు. అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
ఈ అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడాని వీలు కల్పిస్తుందని, దీనివల్ల తెలంగాణ ప్రజలకు ₹5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్నగర్ వంటి కీలక క్లస్టర్లలో మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కేటీఆర్ తన లేఖలో వివరించారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన మరియు దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే, కొత్త HILTP కింద, పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చుకోవడానికి SRO (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం) విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆయన ఆరోపించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజాలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తుందని కేటీఆర్ లెక్కలు ఆరోపించారు. వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేశారు.
ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకతలేదని, కేవలం డబ్బులు దండుకోవాలని మాత్రం వలననే సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారా దత్తం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తొందరపాటుతనం, ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని కేటీఆర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలనే ఈ విధానం యొక్క లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారిలో లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు పక్కా ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది అన్నారు.
పరిశ్రమల తరలింపు ప్రధాన లక్ష్యం అయితే, ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయంగా కాకుండా పూర్తి స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలనడం, ఒక్కొక్క దరఖాస్తు వారీగా ప్రత్యేకంగా ప్రభుత్వం భూముల ట్రాన్స్ఫర్ కి ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల తరలింపుకు ఎలాంటి గడవు నిర్ధారించకపోవడం, అసలు పరిశ్రమలు తరలి వెళ్తాయా లేదా అన్న అంశాన్ని ప్రకటించకపోవడం వంటి అనేక లోపభూహిష్ఠమైన పాలసీని కేవలం డబ్బులు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా తీసుకువచ్చిందన్నారు. తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని, ఈ భూముల ట్రాన్స్ఫర్ వలన కలిగి ఆవరణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.
దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు మరియు వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విధానం “కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి గల రియల్ ఎస్టేట్ గ్రూపులు మరియు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించబడింది. వీరందరికీ నామమాత్రపు ధరకి రాజధాని నగరంలోని అత్యంత విలువైన భూములను పొందడానికి రూపొందించిన పాలసీ అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు అవినీతి కోసం డబ్బుల కట్టల కోసం తీసుకువచ్చిన ఈ పాలసీ ముమ్మాటికి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేయడమే అన్నారు.
మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించిన కేటీఆర్, తమ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడికి పారిశ్రామిక యూనిట్లు SRO విలువలో 100 నుండి 200 శాతం చెల్లించాలని కఠినమైన నిబంధనలను అమలు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సరైన పరిహారం అందేలా చూసుకుందని వివరించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిబంధనలు తొలగించి, తెలంగాణను “కాంగ్రెస్ పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీ నేతల అనుచరులకు ఏటీఎం”గా మార్చేశారని, తద్వారా ప్రజా సంపదను దోచుకోవడానికి ఈ పాలసీని రూపొందించారని కేటీఆర్ ఆరోపించారు. చివరిగా, కేటీఆర్ రాహుల్ గాంధీకి రెండు కీలక ప్రశ్నలు సంధించారు.
మొదటిది, ఈ పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న ఐదు లక్షల కోట్ల అవినీతి స్కామ్ ని అడ్డుకోవాలన్నారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీకి భాగస్వామ్యం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని భావించాల్సి ఉంటుందన్నారు.
రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన టిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. తను రాస్తున్న ఈ బహిరంగ లేక కు రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందా లేదా ప్రజల ఆస్తులను దోచుకుంటున్న తమ పార్టీ నేతలకు అండగా నిలబడేలా మౌనం మాత్రమే సమాధానంగా వస్తుందా అన్నది ప్రజలు గమనిస్తారని కేటీఆర్ తన లేఖ ముగించారు.