– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి పివి . నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాజీ ప్రధానమంత్రి పివి 102 వ జయంతి సందర్భంగా పివి మార్గ్ లో గల పివి ఘాట్ లో మంత్రి తలసాని నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పివి నరసింహ రావు అని పేర్కొన్నారు. బహుబాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు గా పేరుగాంచారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం పివి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందని చెప్పారు. పివి శతజయంతిని ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
అంతేకాకుండా నెక్లెస్ రోడ్డుకు పివి మార్గ్ గా నామకరణం చేయడమే కాకుండా భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తినట్లు వివరించారు. ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన పివి నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ , పివి కుమార్తె సురభి వాణిదేవి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, RDO వసంత తదితరులు ఉన్నారు.