ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం
హైదరాబాద్: నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు నా శుభాకాంక్షలు. శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారు. ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసాం. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నా.
ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించాం. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాం. మరో 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60 వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామన్నారు.