Suryaa.co.in

Telangana

ఎన్‌డిఎస్‌ఏ తుది నివేదికను త్వరితగతిన ఇవ్వాల్సిందిగా అడగండి

సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు ఛత్తీస్ ఘడ్ నుండి అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయండి
– సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను వేగవంతంగా నివృత్తి చేయాలి
త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలి
– సమ్మక్క సాగర్ ముంపువిషయంలో నష్టపరిహారం విషయమై చత్తీస్ ఘడ్ ప్రభుత్వం తో చర్చలు జరపండి
– లష్కర్ ల నియామకాలను వేగవంతం చేయాలి
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం ప్రాజెక్ట్ లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాల్సిందిగా నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. వానాకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలు నిర్వహించి అంతిమ నివేదికను ఎన్‌డిఎస్‌ఏ నిపుణుల కమిటీకి సమర్పించాలని ఆయన చెప్పారు.

బుధవారం ఉదయం జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్‌డిఎస్‌ఏ కు అందించాల్సిన తుది నివేదికతో పాటు సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు చత్తీస్ ఘడ్ నుండి రావాల్సిన అనుమతులు, ముంపుకు గురయిన సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ నష్టపరిహారం విషయంలో చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చలు తదితర అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు చత్తీస్ ఘడ్ నుండి పొందాల్సిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఇదే ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర జలవనరుల సంఘము లేవనెత్తిన అంశాలపై సత్వరమే నివృత్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

ఛత్తీస్ ఘడ్ లో ముంపుకు గురయిన సమ్మక్క సాగర్ కు నష్టపరిహారం విషయంలో చత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆయన అధికారులకు చెప్పారు.

ముఖ్యంగా ఆరు లక్షల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ను 2025 మార్చి మాసంతానికి పూర్తి చేయాలన్నారు. ఆనకట్టలు,కాలువల భద్రత కు అవసరమైన 1800 మంది లష్కరుల నియామకాలు వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఈ విషయమై నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ స్పందిస్తూ ప్రక్రియను పూర్తి చేశామని ఆర్థిక శాఖా అనుమతులు పొందాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించగా అక్కడికక్కడే ఆర్థిక శాఖా కార్యదర్శి రామకృష్ణ రావు తో మాట్లాడి వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు.

అదే సమయంలో నీటిపారుదల శాఖాకు ప్రజా ప్రతినిధులు పంపిన విజ్ఞాపనలకు వెంటనే స్పందించి సకాలంలో జవాబు ఇవ్వాలన్నారు.
ఇటీవల సంభవించిన వర్షపు విపత్తు ను ప్రస్తావిస్తూ ఆనకట్టలు, కాలువల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE