Suryaa.co.in

Andhra Pradesh

పుట్టకతోనే అంధత్వం… పింఛన్ రాలేదు

– వరదలో సర్వం కోల్పోయామంటూ బాధితుల మొర
– భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదు
-కామాంధులు…. తండ్రి, పెదనాన్న, చిన్నాన్న… కూతురికి మత్తుబిల్లలు ఇచ్చి అత్యాచారం!

– న్యాయం కోసం గ్రీవెన్స్‌లో పలువురి విన్నపాలు

మంగళగిరి: గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధి నుండి ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓ మహిళ… నేతల ముందు మొరపెట్టుకుంటూ.. తనను కూలిపనికి బయటకు పంపించి.. ఇంట్లో ఉన్న కూతురికి మత్తుబిల్లలు ఇచ్చి తన భర్త, అతని అన్నయ్య, తమ్ముడు అఘాయిత్యానికి పాల్పడుతున్నారని.. ఈ దారుణంపై దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. వారిని నిలదీస్తే.. తనను పిచ్చిదాన్ని అని నెపం వేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి తన బిడ్డను రక్షించాలని ఆ మహిళ వేడుకుంది. వినతిని స్వీకరించిన నేతలు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామారాజు, జంగా కృష్ణమూర్తి లు అర్జీని స్వీకరించి పోలీసు అధికారులతో మాట్లాడి విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

• ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామానికి చెందిన కేశనపల్లి చిన్న పోలయ్య విజ్ఞప్తి చేస్తూ.. ఆరేళ్ళు ఉన్న తన కుమారుడు పుట్టకతోనే అంధత్వంతో పుట్టాడని.. పిల్లాడికి అంధత్వ పింఛన్‌ పెట్టమని గత ప్రభుత్వంలో అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని.. టీడీపీ సానుకూలపరులమని పింఛన్ కు అర్హత ఉన్నా ఇవ్వలేదని.. ఇప్పుడు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ.. తమ వద్దకు వచ్చామని గ్రీవెన్స్ లో నేతలకు వినతి పత్రం ఇచ్చి అభ్యర్థించారు.. వెంటనే స్పందించిన నేతలు ఆ మండల ఎంపీడీఓతో ఫోన్లో మాట్లాడి.. పిల్లాడికి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.
• సత్యసాయి జిల్లా రోళ్ల మండలం మజరా అలుపనపల్లికి చెందిన రత్నమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తమ తండ్రి నుండి తమకు వచ్చిన భూమిని పాండురంగారెడ్డి ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతున్నారని.. దాన్ని తన పేరుపై రాయించుకునేందుకు యత్నిస్తున్నారని.. అతనిపై చర్యలు తీసుకుని భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఆమె వేడుకున్నారు.
• విజయవాడ 140వ సచివాలయం పరిధికి చెందిన వరద బాధితులు పలువురు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి.. వరద పరిహారం తమకు అందలేదని… వరదలో తాము పూర్తిగా నష్టపోయామని పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.. మరో మహిళ విజ్ఞప్తి చేస్తూ.. తాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారని తప్పుగా నమోదు చేశారని దాన్ని మార్చి పూర్తి పరిహారం అందించాలని వేడుకున్నారు.
• గుంటూరుకు చెందిన ఎన్.లక్ష్మి విజ్ఞప్తి చేస్తూ.. బతుకుదెరువుకోసం సీఎస్ పురం నుండి గుంటూరుకు వస్తే.. తమ భూములను కబ్జా చేశారని… అయిదేళ్ళ నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడంలేదని.. తమ భూమిని తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• గుంటూరు కొరిటెపాడుకు చెందిన మాదల రంగారావు వేడుకుంటూ.. తమభూమిని అమ్మమని లక్షా 40 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. రిజిస్ట్రర్ చేయించుకుని మిగిలిన డబ్బులు రూ. 38 లక్షలు ఇవ్వకుండా తమను మోసం చేశారని.. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వడంలేదని మాదల శ్రీనివాసరావు, అతని బావరిది అలూరి వెంకటేశ్వరరావులపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.
• విజయనగరం జిల్లా, రాజాం నగర పంచాయతీ సారథి గ్రామానికి చెందిన టంకాల దిలీప్ కుమార్ విజ్ఞప్తి చేస్తూ.. రాజాం నగర పంచాయతీలో 2018-2019లో ఎస్‌డీపీ, ఎస్‌డీఎస్‌ గ్రాంట్ల కింద సిమెంటు రోడ్లు, కాలువలు పనులు చేశానని.. వాటికి సంబంధించిన బిల్లులు నేటికి మంజూరు కాలేదని.. దాంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. దయచేసి బిల్లులు ఇప్పించాలని గ్రీవెన్స్ లో నేతలను కలిసి వేడుకున్నారు.
• వీలైనంత త్వరగా రాజాం, సారథి, కొండంపేట, కొత్తవలస, పొనుగుటివలస పంచాయతీలను నగర పంచాయతీగా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని.. రాజాం నగర పంచాయతీగా ఏర్పడి 18 ఏళ్ళు కావస్తున్న ఎన్నికలు నిర్వహించక ప్రజా ప్రతినిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని సారథి గ్రామ మాజీ సర్పంచ్ టంకాల వెంకటేశం గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
• బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కట్టావారిపాలెం గ్రామానికి చెందిన పావులూరి శ్యాం విజ్ఞప్తి చేస్తూ.. దైవ దర్శనం కోసమని తన కూతరుని తీసుకుని మాలకొండకు వెళ్లగా.. తన కూతురు గుడి బయట కూర్చొని ఉంటే తాము గుడిలోకి వెళ్లి వచ్చే సరికి కనిపించలేదని ఎక్కడ వెతికినా జాడ దొరకలేదని.. తన కూతురు వెంట కట్టా బన్ని అనే వ్యక్తి పడేవాడని.. అతనిపై అనుమానం ఉందని.. దయ చేసి తన కూతురును వెతికిపెట్టాల్సిందిగా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• విజయవాడకు చెందిన బోర సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేస్తూ.. వ్యాపారం నిమిత్తం షాపు కొనడానికి అర్జా రూప్ కుమార్ అనే వ్యక్తి రూ. 12,53,000 డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామని.. షాప్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని.. తమకు దయచేసి డబ్బులు ఇప్పించవల్సిందిగా వేడుకున్నారు.
• ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం మంగాపురం గ్రామానికి చెందిన బండి రాజశేఖర్ రెడ్డి, బండి చంద్రశేఖర్ రెడ్డిలు విజ్ఞప్తి చేస్తూ.. తమ తండ్రి నుండి వచ్చిన భూమి ఇతరులు అని ఆన్ లైన్ లో చూపడంతో దాన్ని సరిచేయాలని.. పలు మార్లు అధికారులకు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోకుండా.. తమ భూమిని మంగాపురం గ్రామానికి చెందిన అన్నెం బ్రహ్మారెడ్డి పేరుతో అక్రమంగా ఆన్ లైన్ చేశారని.. ఈ అక్రమానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

LEAVE A RESPONSE