Suryaa.co.in

Telangana

తెలంగాణలో ఉద్యోగ మేళా

– నెరవేరుతున్న నిరుద్యోగుల ఆకాంక్షలు
– పది నెలల్లోనే భారీగా నియామకాలు

హైదరాబాద్: నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ… ఉద్యోగాల మేళా కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. అప్పటివరకు పెండింగ్ లో ఉన్న పరీక్షల ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగించి.. ఫలితాలు విడుదల చేయటంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో అటు నిరుద్యోగులకు ఉద్యోగ ధీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఖాళీలన్నింటిలోనూ పారదర్శకంగా ఉండే విధానాన్ని అమలు చేస్తోంది.

గత ప్రభుత్వం పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. జులైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలను అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3967 పోస్టుల నియామకానికి వరుసగా మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేసింది.
సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నిషియన్, సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, సెప్టెంబర్ 24న 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయటం విశేషం.
రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 8,304 మందికి నియామక పత్రాలను అందించింది.

టీజీపీఎస్సీ

టీజీపీఎస్సీ ద్వారా 26 వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా దాదాపు 17341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొందరికీ నియామక పత్రాలు అందించింది.ఇటీవలే ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.

గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. 8180 పోస్టుల నియామకాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సంక్షేమ శాఖలలోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి.

గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 3,02,172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయితే,నెల రోజుల్లోపల జులై 7న ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షెడ్యూలు ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించనుంది.

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వరంలో 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను కూడా గత ప్రభుత్వం వెల్లడించ లేకపోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించింది.

మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు:

మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 డిసెంబర్లో నిర్వహించిన 7094 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలు కూడా అప్పుడు పెండింగ్ లో పడ్డాయి. ఫలితాలను విడుదల చేసిన కొత్త ప్రభుత్వం వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది.

LEAVE A RESPONSE