Suryaa.co.in

National

రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గా,చర్చి, గురుద్వారాలు తొలగించాల్సిందే

– ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు
– బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే.. తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది.

ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
బుల్డోజర్ జస్టిస్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ విచారించారు.

రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా, న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలని తేల్చాక నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నట్లు వివరించారు. ఏదో ఒక ఘటననో, ఓ వర్గం వారి ఆరోపణలతోనో కూల్చివేతలు అక్రమమని భావించవద్దని కోరారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం మనది లౌకిక దేశమని గుర్తుచేస్తూ.. మత విశ్వాసాలకన్నా ప్రజల భద్రతే ముఖ్యమని గతంలోనూ పలు తీర్పుల్లో స్పష్టం చేసినట్లు తెలిపింది. రోడ్లపై ఉన్న మతపరమైన కట్టడాలను తొలగింపును కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. నిందితుల ఇళ్ల కూల్చివేత విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఆక్రమణల తొలగింపు చట్టప్రకారమే జరగాలన్నదే ధర్మాసనం అభిప్రాయమని స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE