– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచంద్రరావు
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంలో, బీఆర్ఎస్ కు చెందిన నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి తన అనుచరులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన రాంచందర్ రావు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతి పాలనను చూసారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను కూడా చూశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయలేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయలేదు. గతంలో బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో మాత్రమే బీజేపీ ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేసిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం చేసింది. కానీ ఆ పోరాటాల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పొంది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన యాతన అనుభవిస్తున్నారన్నారు.
పెద్దపల్లి జిల్లాలో వ్యవసాయం చేసేవారు అధికంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరానికి మించిన ఎరువులను రాష్ట్రానికి అందిస్తోంది. ఎక్కడా ఎరువుల కొరత లేదు. 2024–25 రబీ సీజన్లో రాష్ట్రానికి అవసరమైన యూరియా పరిమాణం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేంద్రం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. అంటే అవసరానికి మించి అధికంగా ఇచ్చిందని తెలిపారు. అయినా కూడా రాష్ట్రంలో ఎరువులు బ్లాక్ మార్కెట్కి చేరుతున్నాయి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతోందని ఆరోపించారు. ఎరువుల దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. మానిటరింగ్ లేకపోవడం, వ్యవసాయ శాఖ అలసత్వం, బ్లాక్ మార్కెట్ నిరోధించడంలో విఫలమవడం ప్రధాన కారణాలు.
బ్లాక్ మార్కెట్కు ప్రోత్సాహం ఇస్తూ దళారులకు సహకారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు యూరియా కొరత తీరేందుకు రూ. 6300 కోట్ల వ్యయంతో కేంద్రం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించింది. పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు రూ. 20 వేల కోట్ల అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడత నిధులుగా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 20,500 కోట్లు నేరుగా జమచేసిందని తెలిపారు. ఎన్టీపీసీ ద్వారా 2600 మెగావాట్లతో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ద్వారా 4310 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి జిల్లాను వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పింది. కానీ గత 19 నెలల పాలనలో ఈ జిల్లాను పూర్తిగా విస్మరించింది. అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించరు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక మాటతప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున తాత్కాలికంగా రెండు విడతల్లో కేవలం రూ. 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు.