★ ఎట్టకేలకు సౌదీ నుంచి స్వగ్రామానికి
★ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ
★ నీ వొడిలోకి వస్తాను తల్లీ… నన్ను సల్లంగ దీవించు తల్లీ… అంటూ మాతృభూమిని తలుచుకుంటూ, స్వయంగా గొంతెత్తి పాడిన పాటను ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ నోడల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్.
హైదరాబాద్: హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఏడేళ్ళుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు.
గల్ఫ్ కార్మికుడు ఈశ్వర్ దీన గాథకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో… ఎడారిలో అతను పడ్డ ఏడేళ్ల తపనకు తెర పడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన ఆ తెలంగాణ వలస జీవి, మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్ కు ఆదివారం చేరుకొనున్నారు.
గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నివసించే, కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకులు మహ్మద్ జబ్బార్.. ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి ఈశ్వర్ ఇంటికి వెళ్ళడానికి మార్గం సుగమం చేశారు.
సౌదీ నుంచి స్వగ్రామానికి వెళ్లే ఆనందంలో, భావొద్వేగంతో గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు అంకితం చేసిన పాట ఈ విధంగా ఉంది.
ఏడున్నవే నా పల్లే… నువ్వు ఏడున్నవే నా తల్లీ! బతుకు దెరువు కోసం బాట పట్టినా… పొట్ట తిప్పల కోసం సౌదీ కొచ్చినా! నెలలు గడిచిపాయే, ఏండ్లు గడిచిపాయే, ఏడేండ్ల పొద్దాయే…ఎండిపోయిన రొట్టె నేను తినుకుంటా… నాచుగట్టిన నీళ్లు నేను తాగుకుంటా… కారండ అడవిలో గొర్ల కాసుకుంటా… నేను కాలమెల్లదీత్తి తల్లీ.. నేను కడుపు గట్టుకుంటి తల్లీ! నీ వొడిలోకి వస్తాను తల్లీ… నన్ను సల్లంగ దీవించు తల్లీ!
2017 ప్రారంభంలో హౌస్ డ్రైవర్గా పని చేసిన ఈశ్వర్, కొద్ది నెలలకే ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఏడేళ్లు గడిపాడు. ఈశ్వర్ భార్య తాళ్లపల్లి లత, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదరాబాద్లోని ప్రజాభవన్లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కౌంటర్ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల పేరిట 2025 జూన్ 27న వినతిపత్రం అందజేశారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి స్వయంగా వెంట ఉండి వారికి మార్గనిర్దేశనం చేశారు.
‘సీఎం ప్రజావాణి’ నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్, ఈశ్వర్ ను వాపస్ తెప్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై విభాగం ద్వారా రియాద్లోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాయించారు.