– రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి
– జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలని అన్నారు. ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
సచివాలయంలో సోమవారం జల వనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు. ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లినట్టే.. మిగతా ప్రాంతాలకూ నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళ్తుంటే బాధ కలుగుతోందని సీఎం అన్నారు.
వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రాయలసీమలోని చెరువులు నింపేందుకు ఎంత నీరు అవసరం, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయన్న అంశాలను గుర్తించి వాటిని సరి చేయాల్సిందిగా సీఎం సూచించారు. తెలుగు గంగ, కుందూ నదుల విస్తరణ జరిగితేనే నీటిని దిగువన రిజర్వాయర్లకు తరలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.
ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి రాయలసీమలోని జిల్లాలకు నీరు అందుతోందని.. సోమశిల, కండలేరు రిజర్వాయర్లను త్వరగా నింపాలన్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లిలో ఉన్న చెరువులను ఈ నీటి ద్వారా నింపాలన్నారు. నిప్పుల వాగు, కుందూ విస్తరణ ద్వారా 35 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని అధికారులు వివరించారు.
మరో మూడు రోజుల్లో సోమశిల రిజర్వాయర్ నిండుతుందని, కండలేరు రిజర్వాయర్ నింపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముందని తెలిపారు. జీడిపల్లి నుంచి పీఏబీఆర్ కు అక్కడి నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లను నింపాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలో భూగర్భ జలాలు రీఛార్జి చేసే అంశంపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు నీటి మట్టం 9.92 మీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
పోలవరం ఎడమ కాలువ పనుల్లో వేగం పెంచండి
పోలవరం ఎడమకాలువ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధులకు ఇబ్బంది లేదని పనులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. వంశధార- నాగావళి, చంపావతి నదులను అనుసంధానించేందుకు ఏం పనులు చేపట్టాలన్న అంశాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రూల్స్ కోసం కాదు రిజల్ట్స్ కోసం పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు.
గాలేరు నగరి ద్వారా కడపకు, పేరూరు- బీటీపీ ద్వారా హిందూపూర్ కు, మదనపల్లె, తంబళ్లపల్లిలకు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు వరకూ నీళ్లు తీసుకెళ్లేందుకు ఏం చేయాలన్న దానిపై బ్లూప్లింట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆ శాఖ సలహాదారు వేంకటేశ్వరరావు, ఈఎన్సీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు