– ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
– పంచాయతీలకు నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే
– వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మహేశ్ గౌడ్ కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసు?
– నన్ను బీసీ అన్నది ఆయనే… ఇప్పుడు దేశ్ ముఖ్ అని అంటున్నది ఆయనే
– ఎన్నికలున్నా లేకున్నా హిందూ సమాజం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడే పార్టీ బీజేపీ
– నేను హిందూ ఓటు బ్యాంకుతోనే కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలిచా
– తెలంగాణలోనూ హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తా
– తెలంగాణలోకి వచ్చిన రోహింగ్యాలంతా 2014కు పూర్వం వలస వచ్చిన వాళ్లే
– రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చి ఓటు బ్యాంకు చూస్తోంది కాంగ్రెస్సే
– మేం బరాబర్ గణేశ్ ఉత్సవాల్లో సౌండ్ పెడతాం
– కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
– పీసీసీ అధ్యక్షుడిపై, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బండి సంజయ్
కరీంనగర్: దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి వెంటనే దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టండి. ఆ దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో వెళ్లండి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల 25 వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లంటూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు. ఈ దేశంలో 20 నెలల పాలనలో పంచాయతీలకు నయాపైసా ఇయ్యని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని విమర్శించారు. పంచాయతీలకు అప్పుడైనా, ఇప్పుడైనా నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ఆ కేంద్ర నిధుల కోసమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారే తప్ప ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేనేలేదని అన్నారు.
కరీంనగర్ వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మీడియా ప్రతినిధులు కలిసి మహేశ్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా స్పందిస్తూ మహేశ్ గౌడ్ పైనా, కాంగ్రెస్ నేతలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మహేష్ గౌడ్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు. ఆయన ఏం మాట్లాడారో ఆయనకే తెలియనట్లుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గానో, ప్రజాప్రతినిధిగానో గెలిచి ఉంటే ఓట్ల చోరీ సంగతి తెలిసేది. ఆయన ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి. ఓట్ల చొరీ సంగతి ఆయనకేం తెలుసు? కరీంనగర్ లో ఒక ఓటు వేసి జగిత్యాలలో మరో ఓటు చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం సాధ్యమైతదా? ఆయన ఎట్లా మాట్లాడతారు?
నన్ను కరీంనగర్ ప్రజలు 2 లక్షల 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయనేమో దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి కరీంనగర్ ప్రజలను అవమానిస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టి వాటిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ నేతలు ఊళ్లలోకి పోతే రాళ్లతో కొట్టేంత కోపంతో జనం ఉన్నారు.
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఇచ్చిందా? నాకు తెలిసినంత వరకు 20 నెలల పాలనలో పంచాయతీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు పంచాయతీ ఎన్నికలు సైతం కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారే తప్ప ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే కాంగ్రెస్ కు లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే.
మహేష్ గౌడ్ ను చూస్తే గజిని సినిమా గుర్తుకొస్తుంది. హీరోకు 15 నిమిషాలకు మించి ఏధీ గుర్తుండదు. మహేశ్ గౌడ్ కూడా గజనీ లెక్క తయారైండు. ఆయనే నన్ను బీసీ అన్నడు. బండి సంజయ్ బీసీ కాబట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని మాట్లాడిండు. ఇప్పుడు మళ్లీ ఆయనే నన్ను దేశ్ ముఖ్ అని అంటున్నడు. ఆయన ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్ధం కావడం లేదు.
బీసీ అంటూ బీసీ నాయకుడినే విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ల అని చెప్పి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు. బీసీని ఉప రాష్ట్రపతి చేస్తే ఆయనను ఓడగొట్టాలని చూస్తరు. ఓడిపోతారని తెలిసి రెడ్డి అభ్యర్ధిని ఉపరాష్ట్రపతి బరిలో దింపుతున్నారు. చివరకు ఆ సామాజికవర్గం వాళ్లు కూడా కాంగ్రెస్ ను తిడుతున్నరు.
కరీంనగర్ లో చాలా మంది మైనారిటీ ఇండ్లలో వందల కొద్ది దొంగ ఓట్లున్నాయి. వాటిని తొలగించాలని మాజీ మేయర్ సునీల్ రావు ఫిర్యాదు చేశారు. మైనారిటీ ఓట్లు ఏ పార్టీలకు పడతాయో మీకు తెలుసు. ఆ దొంగ ఓట్లు వేసుకున్నా గెలవలేకపోయిన పార్టీ కాంగ్రెస్.
దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే 8 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీ ఎందుకు గెలుస్తుంది. మొత్తం ఎంపీ స్థానాలను గెలుచుకునే వాళ్లం కదా? కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ఫ్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? నేను దొంగ ఓట్లతో గెలిచి ఉంటే ఎన్నికలైపోయిన వెంటనే ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
ఇంగిత జ్ఝానం లేకుండా మాట్లాడితే ఎట్లా? నాకు తెలిసినంత వరకు ఆయనకు (మహేష్ గౌడ్) భద్రత ఇవ్వడం లేదట. బండి సంజయ్ ను తిడితే బీజేపీ నాయకులు ధర్నాలు చేసి అడ్డుకుంటారు. ఆందోళనలు చేస్తారు కాబట్టి అప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనకు భద్రతను పెంచుతుందనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడినట్లు కన్పిస్తొంది.
మతం పేరు చెప్పి ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ నాయకులని ఆయన అంటుంటే నవ్వొస్తుంది. ఎన్నికలున్నా లేకున్నా హిందూ సమాజం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ బీజేపీ కొట్లాడతది. బైంసాలో పేద హిందువుల ఇంగ్లను తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెసోళ్లు ఎటు పోయారు? గోహత్యలు జరుగుతుంటే ఎటు పోయారు? అనేక మంది హిందువులపై పీడీ యాక్టులు పెట్టి వేధిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు?
మక్కా యాత్రకు పోయే ముస్లింలకు డబ్బులిచ్చి అన్ని సౌకర్యాలిచ్చి పంపుతున్నారు. అయ్యప్ప భక్తులను పట్టించుకోరు. చివరకు గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలంటే రోడ్డుకు అడ్డం ఉందని, సౌండ్ పెట్టొద్దని, ర్యాలీలు చేయొద్దంటూ రకరకాల షరతులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నరు. మేం బరాబర్ గణేశ్ ఉత్సవాల్లో సౌండ్ పెడతాం. చట్టానికి లోబడి ఉత్సవాలు జరుపుకుంటాం.
ఓట్ల కోసం బిచ్చమెత్తుకునే బతుకు కాంగ్రెస్ దే. ఎన్నికలొస్తున్నయంటే టోపీలు పెట్టుకుని మసీదులకు పోయి ప్రార్ధన చేస్తున్నట్లు నటించడమే కాదు జీవించే పార్టీ కాంగ్రెస్. ఇఫ్తార్ విందులిస్తూ నటించేది కాంగ్రెస్ నేతలు. సనాతన ధర్మం, హిందు ధర్మ పరిక్షణ కోసం మాట్లాడితే బిచ్చమెత్తుకున్నట్లా? అట్లయితే నేను చెబుతున్నా..నేను కరీంనగర్ ఎంపీగా గెలిచానంటే అది హిందూ ఓట్లతోనే. ఆ విషయాన్ని బరాబర్ చెబుతా. గల్లా ఎగరేసుకుని గర్వంగా చెబుతా తెలంగాణలోనూ హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తాం.
కేంద్ర హోం బాధ్యతలు చూస్తున్న బండి సంజయ్ రోహింగ్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొందరు అవగాహన లేని ఫాల్తుగాళ్లు మాట్లాడుతున్నరు. రోహింగ్యాలు 2014కు ముందు ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చారు. అప్పుడు అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్సే. మోదీ ప్రభుత్వం వచ్చాక అక్రమ వలసను నిరోధించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మిస్తోంది. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటోంది.
రోహింగ్యాలను పంపాలని చెబుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సహకరించలేదు. పైగా ఓటు బ్యాంకు కోసం ఓటర్ కార్డులిచ్చి, రేషన్ కార్డులిచ్చి, ఇండ్లు ఇచ్చి వాళ్లను పెంచి పోషిస్తున్నరు. పాకిస్తాన్ నుండి వచ్చి రోహింగ్యాలు ఇండియాకు, పాకిస్తాన్ కు యుద్దం జరిగితే ఎవరికి మద్దతిస్తారు? పాకిస్తాన్ కు మద్దతిచ్చే వాళ్లను ఓటు బ్యాంకు కోసం పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్రమ వలసలు లేకుండా నిరోధిస్తున్నాం.
పాస్ పోర్టు, వీసా గడువు ముగిసిన తరువాత విదేశీయులందరినీ వాళ్ల దేశాలకు పంపిస్తున్నాం. ఇది తెలియని మూర్ఖులు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా…ఆయనెందుకు రోహింగ్యాలపై చర్యలు తీసుకోలేదంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నరు. వాళ్లు ఈ ముందు ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది.