– డైలీ సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
– సీబీఐ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హర్షం
హైదరాబాద్: కాళేశ్వరం లో జరిగిన అవినీతిపై తమ పార్టీ బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరే సరైందని స్పష్టమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం అవినీతిపై తాము మొదటి నుంచి సీబీఐ విచారణ కోరుతున్నామని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను కాపాడే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో ఇంత జరిగాక, బీఆర్ఎస్ నైతిక బాధ్యత వహించాలని సంజయ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి తలవంచి, ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలి అని డిమాండ్ చేశారు.
గతంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ను ప్రకటించిందని, నేటికీ అది కార్యరూపం దాల్చలేదని, రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఒక డైలీ సీరియల్లా కొనసాగుతోందని విమర్శించారు.