– వేలంలో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డు వేలం పూర్తయింది. కర్మాన్ ఘాట్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు వేలంపాట లో లడ్డూను గెలుచుకున్నారు.
హైదరాబాద్ సహా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూకు విశేషమైన ఆదరణ ఉంది. లడ్డూ ప్రసాదం స్వీకరించేవారికి కోరిన మొక్కులు తీరుతాయని, కుటుంబాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతియేటా బాలాపూర్ లడ్డూ వేలాన్ని ప్రత్యేకంగా ప్రజలు చూస్తుంటారు.
కోట్లలో లడ్డు వేలం జరుగుతున్నా బాలాపూర్ లడ్డూతో ప్రజలు పోల్చి చూడరు. బాలాపూర్ లడ్డు ప్రత్యేకమైనది. దేశంలోనే ప్రత్యేకత సాధించింది. దేశవ్యాప్తంగా బాలాపూర్ లడ్డూ వేలాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు. లడ్డూ వల్లే ఇక్కడి గణేశుడికి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత బాలాపూర్ గణేశుడికి ఎక్కువ ఆదరణ ఉంది. ఖైరతాబాద్ లడ్డూ వేలం వేసే సంప్రదాయం లేదు కాబట్టి, బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలానికి ఆధరణ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ వేలంపాట కు దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో, పోటాపోటీగా ఇతర చోట్ల కూడా లడ్డూ వేలంపాటలు నిర్వహిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న కీర్తి రిచ్మండ్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ లో కమ్యూనిటీ నివాసితులు ప్రత్యేకంగా వేలంపాట నిర్వహిస్తున్నారు.. ఈసారి రికార్డు స్థాయిలో రూ.2.32 కోట్ల ధర పలికింది. అయితే ఇది బహిరంగ వేలంపాట కాదు.. కేవలం వాళ్ళ కమ్యూనిటీ కి పరిమితమైనది కాబట్టి మిగతా వేలంపాటల మాదిరిగా పరిగణించట్లేదు. మొత్తం మీద రిచ్మండ్ కమ్యూనిటీ లడ్డూ ఇప్పటివరకైతే దేశవ్యాప్తంగా అత్యధిక ధర పలికిన లడ్డూ గా గుర్తించబడుతోంది.