– మామిడి, నారింజ పండ్ల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం
– 3,745 కోట్ల పెట్టుబడి, 1,518 మందికి ఉపాధి కల్పించే మూడు కంపెనీలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం
– ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: భారీగా పెట్టుబడులు పెడుతూ యువతకు ఉపాధి, వివిధ రకాల పండ్లు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం కలిగించే పద్ధతుల్లో బహుళ జాతి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెల్లువలా కదిలి వస్తున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయని డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాల ఆసక్తి చూపుతున్న JSW UAV లిమిటెడ్ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించడానికి, తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్ మరియు బుషింగ్స్ పరిశ్రమ ఏర్పాటుకు, హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఈ మూడు భారీ కంపెనీల ఏర్పాటు ద్వారా 3,745 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,518 మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రుల బృందం తెలిపింది.
సుమారు 2,398 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కోకా కోలా బేవరేజెస్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుందని, 785 కోట్లతో రూపాయల పెట్టుబడితో వస్తున్న JSW కంపెనీ ద్వారా 364 మందికి ఉపాధి లభిస్తుందని, 562 కోట్ల రూపాయల పెట్టుబడి తో వస్తున్న తోషిబా కంపెనీ ద్వారా 554 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రులకు వివరించారు.
కోకా కోలా వంటి కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మామిడి, నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బేవరేజెస్ పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యాన పంటల ఉత్పత్తులు ఆయా కంపెనీలకు అవసరం అవుతాయని, తద్వారా రాష్ట్రంలో మామిడి, నారింజ వంటి పంటలు సాగు ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడి రాష్ట్ర రైతులకు గణనీయంగా ఆదాయం సమకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
దావోస్ తో పాటు వివిధ దేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన వివిధ కంపెనీలు జరిగిన mou లు, విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి , కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.