– మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతా
– రేవంత్ రెడ్డి అనాలోచిత, అహంకార, నియంతృత్వ పోకడ నిర్ణయంతో తెలంగాణ ప్రజలపై ₹15 వేల కోట్ల భారం
– మేడిగడ్డ బరాజ్ ల విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే కుట్రలో భాగం కానందుకే ఎల్&టీపై సీఎం పగబట్టారు
– ఎయిర్పోర్ట్ మెట్రో రద్దుతో మొదలుపెట్టి.. నానా రకాలుగా వేధించారు
– మెట్రో భూములపై సీఎం, ఆయన అనుచరుల కన్ను పడింది
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత, నియంతృత్వ పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్&టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొలగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా ₹15 వేల కోట్ల అప్పుల భారం పడిందని విమర్శించారు.
మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఎల్&టీ ముందుకురావడమే రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని, అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి, రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేలా చేశారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ , ఎల్&టీ నిష్క్రమణ వెనుక ఉన్న కుట్రలు, ప్రభుత్వ వైఫల్యాలను పూసగుచ్చినట్టు వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును ఎలా ఆదుకొని నిలబెట్టిందో కేటీఆర్ వివరించారు. “2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20-25% మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర విభజనతో రైడర్షిప్ తగ్గుతుందని ఎల్&టీ సంస్థ ఆందోళన చెందితే, స్వయంగా కేసీఆర్ గారే వారికి ధైర్యం చెప్పారు. ప్రజా రవాణా ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, హైదరాబాద్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చి పనులను పరుగులు పెట్టించారు.
కేవలం మూడేండ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించాం. కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే, కేసీఆర్ గారు మరోసారి అండగా నిలిచారు. ₹3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో ₹900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారు. మా ప్రభుత్వ హయాంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి, పీక్ అవర్స్లో కోచ్లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశాం.
69 కిలోమీటర్ల లైన్ పూర్తిచేసి, దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఆవాస హోటల్ వరకే ఉన్న లైన్ను, లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి, స్కైవాక్లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం” అని కేటీఆర్ తెలిపారు.
“మేము అధికారం నుంచి దిగిపోయే ముందు, హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించాం. ఓఆర్ఆర్ చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి, షాద్నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపాం. అత్యంత కీలకమైన మైండ్స్పేస్-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించాం.
భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే (at-grade) నిర్మించేలా దీన్ని డిజైన్ చేశాం. కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. నా భూములు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చి పిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్&టీపై మొదటి దెబ్బ వేశారు. అప్పటి నుంచే సీఎంకు, ఎల్&టీకి మధ్య పంచాయితీ మొదలైంది” అని కేటీఆర్ అన్నారు.
“మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా మా సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్&టీ ముందుకు వచ్చింది. కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అని బద్నాం చేద్దామనుకున్న రేవంత్ రెడ్డి ప్రచారానికి ఇది గండికొట్టింది. తమ రాజకీయ లబ్ధికి ఎల్&టీ సహకరించలేదనే కోపంతో సీఎం ఆ సంస్థపై పగబట్టారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో వరకు ప్రతి విషయంలో ఆ సంస్థను వెంటాడి, వేధించారు.
నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్ వేసిన ఎల్&టీకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి, తన అనుచరుడైన బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థకు పనులు కట్టబెట్టారు. ‘మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకుంటే బ్లాక్ లిస్టులో పెడతా’ అని బెదిరించారు.
ఈ కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్న ఎల్&టీ సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసింది. ‘తెలంగాణ రైజింగ్’ అని చెప్పుకొనే సీఎం.. పెట్టుబడులకు స్వర్గధామమైన రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సమాధానం చెప్పాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆర్థిక చేతగానితనాన్ని ఎండగడుతూ, “తెల్లారిలేస్తే ఖజానా ఖాళీ, అప్పు పుట్టడం లేదని సీఎం మొత్తుకుంటారు. ఐటీడీఏ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే దిక్కులేదు. ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైవేటు సంస్థ మోస్తున్న భారాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకొని ₹15 వేల కోట్ల అప్పు చేయడం దేనికి? మీ అహంకారపూరిత నిర్ణయాలతో ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపారు?” అని కేటీఆర్ నిలదీశారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రం ఇప్పటికే ₹2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి ఈ ₹15 వేల కోట్లు అదనమని అన్నారు.
“ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఎల్&టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన సన్నిహితులకు కన్ను పడింది. ఆ భూములను అడ్డగోలుగా అమ్మకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారు.
ఇప్పటికే ఉన్న మాల్స్ను ఎవరెవరికి రాసిస్తారో త్వరలోనే చూస్తారు. ఇది హైదరాబాద్ ప్రజల మీద వేసిన పెద్ద భారం. ఈ నిర్ణయంతో ఎల్&టీ షేర్ విలువ 3% పెరిగింది, మరి రాష్ట్ర ప్రజలకు ఒరిగిన లాభమేంటి? ఏ ముడుపులు, ఏ కమిషన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో సీఎం చెప్పాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
“రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక స్కీమ్, ఒక స్కామ్ ఉంటుంది. ఈ నిర్ణయంలో పారదర్శకత లేదు. కనీసం కేబినెట్ సబ్ కమిటీ వేయలేదు, కేబినెట్లో చర్చించలేదు. ‘చట్ మంగ్నీ, ఫట్ షాదీ’ అన్నట్టు నిర్ణయం తీసుకుంటారా? దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. ప్రజల్లోకి వెళ్తాం. మేం సృష్టించిన ₹20 వేల కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే, మీరు ₹15 వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.
“నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నేను పదేళ్లు మంత్రిగా చేశాను, లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పాను. నా నిజాయితీకి భయం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోమనండి. రేవంత్ రెడ్డికి పైశాచిక ఆనందం కలిగితే కలగనీయండి. కానీ ప్రజల పక్షాన వృద్ధులకు ₹4000 పెన్షన్, ఆడబిడ్డలకు ₹2500, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తావని అడుగుతూనే ఉంటాం. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతా” అని కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పాలనలో ‘హైడ్రా’ అనే భూతంతో రియల్ ఎస్టేట్ను దెబ్బతీశారన్న కేటీఆర్, పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం తన ప్రతాపం చూపిస్తుందని విమర్శించారు. ఇవాళ బ్లాక్ మేయిల్, బ్లాక్ మేయిలర్స్ కు హైడ్రానే కేంద్రంగా ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కడతారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ గెలుపు తమదేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.