– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం దూది రైతుకు దుఃఖం తెచ్చి పెట్టింది. మక్క రైతుల రెక్కలు విరుస్తుంది. మద్దతు ధర లేక రాష్ట్రంలో పత్తి రైతు చిత్తు అవుతుంటే, మొక్కజొన్న రైతు విలవిలలాడుతున్నాడని ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోంథా తుపాను ధాటికి దిగుబడి తగ్గి రైతు దిగాలు పడుతుంటే.. చేతికొచ్చిన అరకొర పంటకైనా గిట్టుబాటు ధర పెట్టకుండా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే…
పొలం మీదే పంటలకు రైతులు నిప్పు పెడుతుంటే… రైతు సుభిక్షం లాంటి మాటలు చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. క్వింటా పత్తికి కనీస మద్దతు ధర రూ. 8110 ఉంటే మార్కెట్ లో గరిష్ఠంగా రూ.7వేలు పెట్టడం లేదు. వర్షాలకు రంగు మారిందని, తేమ ఉందని, పురుగు సోకిందని కొర్రీలు పెట్టడం దుర్మార్గం. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టీ పత్తి పండిస్తే 6 క్వింటాలు కూడా దిగుబడి రాలేదని, మార్కెట్ ధరతో పోల్చితే ఇంకా రూ 10 వేలు నష్టమేనన్న రైతుల బాధలు వర్ణనాతీతం. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర రూ. 2400 ఉండగా మార్కెట్ లో ధర రూ. 1400 కూడా ఇవ్వకపోవడం అన్యాయం.
తుపాను ప్రభావంతో ఎకరాకు దిగుబడి 10 క్వింటాలకు తగ్గితే, రూ.35వేలు పెట్టిన పెట్టుబడికి… వచ్చే రాబడి రూ.20వేల కన్నా ఎక్కువ లేకపోవడం ఆందోళనకరం. పత్తి, మొక్కజొన్నే కాదు.. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఏ పంటకు మద్దతు ధర లేదు. మిరపకు రూ.12 వేలు మద్దతు ధర ఉంటే రైతుకి దక్కింది రూ. 6 వేలే. వేరుశెనగకు రూ. 8 వేలు ఉంటే రైతుకి ఇచ్చింది రూ. 4 వేలు. కంది పంటకు మద్దతు ధర మీద రూ. 2 వేలు నష్టం.
పెసరకు రూ. 3500 నష్టం. మినుములకు క్వింటాకు రూ. 14 వందల నష్టం. పొగాకు పంట క్వింటాకు రూ.13వేల నష్టానికి, ఉల్లి గడ్డ కిలో 4 రూపాయలకు అమ్ముకున్న దుస్థితి. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా పత్తికి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలి.
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి మద్దతు ధర కల్పించాలి.