రెండేళ్లల్లో రైతులకు 1 లక్ష 4 వేల కోట్లు ఖర్చు చేశాం మక్తల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మక్తల్: పాలమూరు జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మీ ముందు నిలబడ్డా. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా కెసీఆర్ ను ఈ గడ్డ ఆదరించింది. కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదు… పదేళ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచనచేయలేదు.
ప్రజా ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసుకునేందుకు అడుగులు వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారు. ఏ రైతుకు నష్టం జరగవద్దని ఎకరానికి రూ. 20 లక్షలు ఇచ్చి 96 శాతం రైతులను ఒప్పించి భూసేకరణ చేశాం. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసి ఇప్పుడు పనులు మొదలు పెట్టుకోబోతున్నాం.
మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు…పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత నాది ప్రతీ పేదవాడికి విద్య అందించాలని విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం.ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. పార్టీల గురించి ఆలోచన చేయలేదు.. జెండాలు ఎజెండాలు చూడలేదు.పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. జిల్లాలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నాం.
దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే మా ఆకాంక్ష మీరు చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై మీ జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. రెండేళ్లలో రైతులకు 1 లక్ష 4 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తున్నాం. కులగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చాం.
ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. ఒకవైపు కెసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పును చెల్లిస్తూ పాలమూరు అభివృద్ధికి మీ బిడ్డగా కృషి చేస్తున్నా. రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నెల 8,9 న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చి దిద్దుతాం. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోండి. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి.. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది.. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా అభివృద్ధి చేసుకుందాం







