– సీఎం ఫుట్ బాల్ సరదా కోసం రూ.100 కోట్లకుపైగా ఖర్చు పెట్టడం ప్రజాధనం దుర్వినియోగం కాదా?
– భట్టి ఆర్ధిక శాఖ బిల్లుల క్లియరెన్సుకు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నా సీఎం పట్టించుకోవడం లేదు
– ఈ ఫుట్ బాల్ మ్యాచ్ తో తెలంగాణ ఎలా రైజింగ్ అవుతుందో చెప్పాలి
– మ్యాచ్ సమ్మిట్ లో భాగమని చెప్పేందుకు మంత్రులకు సిగ్గుండాలి
– హైదరాబాద్ లో ఫుట్ బాల్ మ్యాచ్ పెట్టాలనేది నెల రోజుల క్రితం డిసైడ్ అయింది
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: ఎవడబ్బ సొమ్మని సీఎం రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం రూ.వంద కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు … ఇది ముమ్మాటికీ ఆర్ధిక నేరమే. ప్రజాధనంతో ఫుట్బాల్ ఆడుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు నిన్ను ఫుట్ బాల్ ఆడుకుంటారు. సీఎం ఫుట్ బాల్ సరదా కోసం రూ.100 కోట్లకుపైగా ఖర్చు పెట్టడం ప్రజాధనం దుర్వినియోగం కాదా?
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం రూ.ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏ యో శాఖల నుంచి ఖర్చు చేస్తోందో, ఎందుకు ఖర్చు చేస్తోందో సీఎం వివరణ ఇవ్వాలి. సీఎం రేవంత్ టీమ్ ను సింగరేణి స్పాన్సర్ చేస్తోందని మీడియాలో చూసాను. ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగరేణి డబ్బులను ఎంత ఖర్చు చేస్తున్నారు. ఎందుకు ఖర్చు చేస్తున్నారు?
ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదంటే కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు కదా? ప్రభుత్వ శాఖలేవైనా దుబారా ఖర్చులు చేస్తే ను కట్టడి చేయాల్సిన సీఎం, స్వయంగా తన సరదా కోసం దుబారా చేయడం ఆర్ధిక నేరమే. మెస్సీ టీమ్ తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడడం వల్ల రాష్రానికి వచ్చే ప్రయోజనమేంటో సీఎం చెప్పాలి.
అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడితే, అప్పీయరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని మీడియా చూసా( Subject to Correction). మరి మెస్సీకి ఇచ్చే అప్పీయరెన్స్ ఫీజు ఏ ప్రభుత్వ శాఖ ఇస్తోంది? దాని వల్ల కలిగే ప్రయోజనమేంటి? మెస్సీకి ఇచ్చే మొత్తంతోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నది. అంతా కలిపి రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి నిధులను మెస్సీ టూర్ కు మళ్లించినట్టు సమాచారం. ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తో ఈ మూడు శాఖలకు కలిగే ప్రయోజనమేంటి? దేశంలోనే అత్యుత్తమ పది క్రికెట్ గ్రౌండ్లలో ఒకటైన ఉప్పల్ స్టేడియానికి, ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తో తూట్లు పొడుస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ గ్రౌండును ఫుట్ బాల్ గ్రౌండుగా మార్చాలి. మ్యాచ్ ముగిసాక మళ్లీ దాన్ని క్రికెట్ గ్రౌండుగా మార్చాలి. దీని కోసం రూ.10 కోట్ల వరకు ఖర్చు కావచ్చట. మరి ఇదంతా దుబారా కాదా? దీని వల్ల ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ నాణ్యత దెబ్బతినదా?
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సింగరేణి శాఖను సీఎం రేవంత్ టీమ్ కు స్పాన్సరుగా ఉండడానికి ఎందుకు అంగీకరించారో చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూర్తిగా సరెండర్ అయ్యారు. భట్టి ఆర్ధిక శాఖ బిల్లుల క్లియరెన్సుకు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నా సీఎం పట్టించుకోవడం లేదు. అందుకే ఇపుడు సీఎం రేవంత్ ఫుట్ బాల్ సరదా కోసం డిప్యూటీ సీఎం తన సింగరేణి శాఖ ద్వారా పూర్తిగా సహకరిస్తున్నారు
రేవంత్ రెడ్డి కాలేజీ రోజుల్లో ఫుట్ బాల్ ఆడేవారట. అప్పటి సరదా తీర్చుకోవడం కోసం ఇపుడు మెస్సీతో రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్నారు. ఒక గంటన్నర మ్యాచ్ కోసం సీఎం ముందుగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఏకంగా ఫుట్ బాల్ గ్రౌండును ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.ఐదు కోట్లు ఖర్చు చేశారు. ఎవడబ్బ సొమ్మని సీఎం రేవంత్ రెడ్డి తన సరదా కోసం రూ.వంద కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
రూ.వంద కోట్ల ప్రజాధనంతో నీ ఫుట్ బాల్ సరదా తీర్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి … ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు నిన్ను ఫుట్ బాల్ ఆడుకుంటారు. గుర్తుంచుకో. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగానే ఈ ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అని సిగ్గులేకుండా చెప్తున్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ ఫుట్ బాల్ మ్యాచ్ తో తెలంగాణ ఎలా రైజింగ్ అవుతుందో చెప్పాలి.
గ్లోబల్ సమ్మిట్ జరిగింది డిసెంబరు 8,9 తేదీల్లో. ఆ సమ్మిట్ ముగిసిన నాలుగు రోజులకు ఈ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్విహిస్తూ, ఈ మ్యాచ్ సమ్మిట్ లో భాగమని చెప్పేందుకు మంత్రులకు సిగ్గుండాలి. అసలు గ్లోబల్ సమ్మిట్ ప్లానింగులో ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లేనే లేదు. అసలు రేవంత్ సర్కార్ రెండేళ్లు పూర్తి చేసుకున్న విషయం ఈ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీకి తెలుసా?
కేరళ ప్రభుత్వం ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించడం తమ వల్ల కాదని నిరాకరిస్తే, మెస్సీ ఇండియా టూర్ ను ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజేషన్ సీఎం రేవంత్ రెడ్డిని ముంబైలో కలిసి తెలంగాణలో నిర్వహించాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లి కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్టోబరు 31న ముంబై వెళ్లినపుడు, అక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ ఈవెంట్ ఆర్గనైజర్లు కలిశారు. అంటే హైదరాబాద్ లో ఫుట్ బాల్ మ్యాచ్ పెట్టాలనేది నెల రోజుల క్రితం డిసైడ్ అయింది.
కానీ గ్లోబల్ సమ్మిట్ మూడు నెలల క్రితం డిసైండ్ అయింది. మరి వాస్తవాలు ఇలా ఉంటే సీఎం, మంతులు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఫుట్ బాల్ మ్యాచ్ అనడం సిగ్గుచేటు. సీఎం రేవంత్ తన సరదా కోసం ఫుట్ బాల్ ఆడుకునేట్టయితే, అందుకు స్పాన్సర్లను చూసుకోవాలి. కానీ సర్కార్ సొమ్ముతో ఫుట్ బాల్ ఆడడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమే.
బీఆర్ఎస్ సర్కార్ ఈ కార్ రేసింగ్ ఈవెంట్ ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందంటున్న రేవంత్ సర్కార్ … మరి ఇపుడు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడం ప్రజాధనం దుర్వినియోగం కాదా. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి శిక్షార్హుడు కాదా? ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు చేయడంపై క్యాబినెటు భేటీలో చర్చ జరిగిందా? మరి రూ.వంద కోట్లకు పైగా జనం సొమ్మును ఖర్చు చేస్తున్నపుడు క్యాబినెట్ అనుమతి అవసరం లేదా? మేం లేవనెత్తిన ఈ ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిన తర్వాతనే ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాలి. లేదంటే ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కు వ్యతిరేకంగా బిజెపి నిరసన కార్యక్రమాలు చేపడుతుంది.
ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.