– రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని పంచాయతీ ఫలితాలు బట్టబయలు
– దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం రేవంత్
– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: 2025 పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టంగా బయటపెట్టాయని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. మొత్తం 12,700 గ్రామ పంచాయతీలలో మొదటి విడతగా జరిగిన 4,236 పంచాయతీల్లో సాధారణంగా అధికార పార్టీకే 90% వరకు అనుకూలత ఉండే పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ 1,345 సర్పంచ్ స్థానాలు గెలవడం—కాంగ్రెస్కు ప్రజలు జారీ చేసిన మొదటి భారీ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కోతల నాటకానికి, వారి కోటరి ప్రలోభాలకు గ్రామీణ ఓటర్లు గట్టి ‘‘వాత’’ పెట్టారని, బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఒత్తిళ్లను, డబ్బు రాజకీయాలను తట్టుకుని నిలబడటం ప్రజాస్వామ్యానికి ధృవపత్రమని అభినందించారు.
సీఎం ఊరు కొండారెడ్డిపల్లి పక్కనే ఉన్న పోల్కంపల్లిలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం, సీతక్క నియోజకవర్గం ఏటూరు నాగారంలో బీఆర్ఎస్ గెలవడం, మహబూబాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళినాయక్ వదిన ఓడిపోయి ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకునే దుస్థితి రావడం— ఇవి కాంగ్రెస్పై ప్రజల్లో ఎంత తీవ్రమైన అసహనం పెరిగిందో నిరూపిస్తున్నాయని శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో జరిగిన అక్రమాల ద్వారా కాంగ్రెస్ గెలవడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరచడమేనని అన్నారు.
హామీలు అమలు చేయడానికి డబ్బులేదు అని చెప్పే రేవంత్ రెడ్డి, దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా ఎదిగి, జల్సా కార్యక్రమాలు, మ్యాచ్లు, ఇమేజ్ మేకింగ్ షోల కోసం వందల కోట్లు వెచ్చించడం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో గమనిస్తున్నారని తెలిపారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ను ధ్వంసం చేసి ‘మెస్సీ వర్సెస్ మెస్త్రీ’ ఫుట్బాల్ ప్రదర్శన కోసం వంద కోట్లు ఖర్చు చేయడం, సింగరేణి నిధులను మళ్లించడం ప్రజల కష్టార్జిత ధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని ఆయన ఖండించారు.
రెండో, మూడో విడతల్లో ఈ వ్యతిరేకత మరింత పెరిగి బయటపడుతుందని విశ్లేషించిన శ్రవణ్, బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా, సంఘటితంగా ముందుకు సాగి రాబోయే రెండు విడతల ఎన్నికల్లో ప్రజా తీర్పును మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ చైర్మన్ రాకేష్, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ పాలుగోన్నారు.