– ఎనిమిది పేజీలు మాత్రమే ఉంటుంది
– రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేని పార్టీ
– అమరజ్యోతి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహాం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి నిజం
– టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయాన్ని నేను ఒప్పుకోలేదు
– నైతికత లేని బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది
– పార్టీ నుంచి నన్ను కుట్ర చేసి బయటకు పంపారు
– కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు
– లక్ష్మీ నరసింహా స్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు. ఆత్మగౌరవం కోసమే నా పోరాటం.
– శాసన మండలిలో కవిత ప్రసంగం.
– ప్రసంగం మధ్యలో తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న కవిత
హైదరాబాద్: గత సంవత్సరం సెప్టెంబర్ 3 న నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చాను. పూర్తిగా ఛైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ ఇచ్చినప్పటికీ మీరు ఆలోచించుకోవాలని కోరారు. నేను పూర్తి కాన్షియస్ గానే నా రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాకు కారణాలను సభలో చెప్పేందుకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు
రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 40 మందికి మాత్రమే పెద్దల సభలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ గౌరవం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా నాకు ఓటు వేసిన నిజామాబాద్ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ధన్యవాదాలు. ఏ బీఆర్ఎస్ ద్వారా పదవి వచ్చిందో ఆ పార్టీలోనే నేను చేయాల్సిన పనులకు కట్టుబాట్లు ఎదురయ్యాయి. అలాంటి సందర్భంలో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో కొనసాగటం నైతికత కాదు.
నేను సొంతంగా జాగృతి అనే సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించాను. మన పండుగ గౌరవం కాపాడాలని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే కార్యక్రమాలు చేశాను. బతుకమ్మ మన ఆత్మగౌరవ ప్రతీకగా ముందుకు వెళ్లాం. మీడియాలో, సినిమా తో తెలంగాణ యాస, భాషకు జరుగుతున్న అవమానం పై ఫైట్ చేశాం.
2004 లో ఆగస్ట్ లో అమెరికా నుంచి నేను వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వచ్చాను. కేసీఆర్ స్ఫూర్తితో ఎంతో మంది తమ ఉద్యోగాలక రిజైన్ చేసి అప్పటికే ఉద్యమంలోకి వచ్చారు.వారి స్ఫూర్తితోనే నేను కూడా ఉద్యమంలోకి రావటం జరిగింది. తెలంగాణ కోసం మాట్లాడాలంటూ పిలిస్తే కుటుంబ సమేతంగా మేమంతా ఢిల్లీ వెళ్లాం. అక్కడ రెండు నెలల పాటు మమ్మల్ని ఏ కాంగ్రెస్ నాయకుడు పలుకరించలేదు.
ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు కూడా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో రెండు నెలల పాటు కాంగ్రెస్ నాయకులు పట్టించుకోని సందర్భంలో ఫెర్నాండెజ్ తో కేసీఆర్కి మీటింగ్ ఏర్పాటు చేయించాను. ఆ మరుసటి రోజే సోనియా గాంధీ ఒక్కరోజులోనే ఏడెనిమిది సార్లు సంప్రదింపులు జరిపారు.
2013 ఆగస్ట్, సెప్టెంబర్ లో మనమంతా కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు భయపడుతూ ఉన్నాం. ఆంధ్రా లాబీ కారణంగా తెలంగాణ ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డాం. ఆ తర్వాత పార్లమెంట్ లోని రెండు సభల్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది. అందులో నా పాత్ర కూడా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం పై చర్చ జరిగినప్పటికీ విలీనం కాలేదు. బీఆర్ఎస్ ఇండిపెండెంట్ గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.
నిజానికి నేను ఓ ఇంటర్నేషన్ ఎన్జీఓ ను నడపాలని అనుకున్నానే తప్ప రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లే నాకు పిలిచి నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఏ మహిళ అయినా సరే పిల్లలను వదిలి రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచిస్తుంది. నాలుగు నెలల పాటు నా జీవిత భాగస్వామితో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా టికెట్ అడుక్కొని గెలవలేదు. నిజామాబాద్ లో మొత్తం ఎమ్మెల్యే స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలిచింది.
పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్ 30 ఏళ్లు పెండింగ్ లో ఉంటే ఎంపీ అయ్యాక ఆ రైల్వే లైన్ ను పూర్తి చేయించాను. జాగృతి పేరుతో 8 ఏళ్ల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాం. కానీ తెలంగాణ ఏర్పడిన మొదటి బతుకమ్మ 2014 నుంచే నా మీద ఆంక్షలు మొదలయ్యాయి. ఒక పార్టీలో అంతర్గతంగా ఆంక్షలు ఏ విధంగా ఉంటాయో చెబుతాను. మొదటి రోజు నుంచే నన్ను కట్టిడి చేస్తూ నా భావ ప్రకటనను హరించారు.
నా వద్దకు ఎప్పుడు కూడా పెద్దవాళ్లు, కాంట్రాక్టర్లు పనుల కోసం రాలేదు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చేవారు.వారందరికీ కూడా నావంతుగా ఎంత వీలైతే అంత వారికోసం పనిచేశాను. పార్టీ ఛానెల్ గానీ, పార్టీ పేపర్ గానీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాను.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలతో దేశానికి, తెలంగాణకు నష్టమని కేసీఆర్ అన్నారు. కానీ తెలంగాణ వచ్చాక కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయకపోగా పెంచి పోషించారు. ప్రశ్నించటం నేర్పిన బీఆర్ఎస్ పార్టీయే నేను ప్రశ్నిస్తే నా పై కక్ష గట్టింది. కక్ష గట్టి కుట్ర చేసి మరీ నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా నా పాత్ర లేదు.
ధర్నా చౌక్ ను తీసేయాలని నిర్ణయించినప్పుడు నేను ప్రశ్నించా. తెలంగాణ వచ్చాక ధర్నా చౌక్ ఎందుకు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.కానీ రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి బేడీలు వేయటం బాధగా అనిపించింది. పార్టీలో ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ ష్టికి తీసుకెళ్లా. అమరజ్యోతి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహాం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగింది నిజం. సిద్దిపేట, సిరిసిల్ల లో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి.
అక్కడే అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా మిగతా వాటి గురించి ఏమీ చెప్పేది? నిజాన్ని సూటిగా మాట్లాడితే నన్ను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. వారికి న్యాయం చేయాలని…అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు సాయం చేయాలని కోరాను. 48 లక్షల మంది పెన్షన్లు ఇస్తామని గర్వంగా చెప్పుకుంటాం. కానీ లక్ష మంది ఉద్యమకారులకు మాత్రం కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు 1969 ఉద్యమకారులను కూడా కనీసం గుర్తించలేదు.
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్ కు గండికొట్టుకుంటూ పోయాం. కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేవు. ఇసుక దందాల కారణంగా నేరెళ్ల లాంటి దురాగతలు జరిగాయి. నేరెళ్ల సంఘటనపై అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవటం లేదు. 10 ఏళ్లలో 100 సార్లు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోసం అడిగాను. కానీ నిర్లక్ష్యం చేసి భోదన్ బిడ్డలకు అన్యాయం చేశారు.
కేసీఆర్ కూతురిగా ఆయనను అడిగే ధైర్యం నాకు ఉంది. ఒకటి, రెండు అడిగినవి చేయకపోయినా పర్వాలేదు. కానీ కొంతమంది వరుసగా దురాగతాలకు పాల్పడిన సరే పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయాన్ని నేను ఒప్పుకోలేదు. తెలంగాణలో ఏమీ పీకి కట్టమని…దేశంలో పీకుతాం. లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. అదే డబ్బులతో 25 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వవచ్చు.
తెలంగాణ వచ్చాక ఆంధ్రాకు చెందిన ఏ కంపెనీ వాళ్లు ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ లో అవినీతి లేని పారదర్శక విధానాన్ని మనం చూడాలనుకున్నాం. అది జరగలేదు. ఇక తెలంగాణను పదే పదే బీజేపీ మోసం చేస్తున్నది.
ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. పైగా ఐటీఐఆర్ రాకుండా చేసి ఇక్కడి యువతకు అన్యాయం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారిని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరింది. అలాంటి బీజేపీ పై నేను ఎడతెగని పోరాటం చేశాను. కేసీఆర్ పై కక్షతో నన్ను జైల్లో పెట్టారు. ఆ సమయంలో నాకు పార్టీ అండగా లేదు.
ఈడీ, సీబీఐ లతో మూడేళ్లు ఒక్క దాన్నే ఫైట్ చేశాను. ఓ పోరాటంలో సహచరులు గాయపడి పడిపోతే భుజాన ఎత్తుకొని వెళ్తారు. కానీ నన్ను వదిలేశారు. అది ఏమాత్రం రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న పార్టీ వ్యవహరించే తీరు కాదు. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఘోష్ కమిటీ అని వేశారు. కేసీఆర్ ని విచారణ అంటూ ఎన్నో మాటలు అంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడు. అదే కేటీఆర్, కేటీఆర్ ని అంటే మాత్రం పార్టీ నాయకులు విమర్శలు చేస్తారు.
నేను హరీష్ రావు పేరు చెప్పిన రెండు గంటల్లో నన్ను సస్పెండ్ చేశారు. ఉరి తీసేవాళ్లను కూడా చివరి కోరిక ఏంటనీ అడిగే గొప్ప దేశం మనది. కానీ నన్ను మాత్రం అన్యాయం గా పార్టీ నుంచి వెళ్లగొట్టారు. అసలు బీఆర్ఎస్ పార్టీ కానిస్టిట్యూషన్ కమిటీ 8 పేజీలు ఉంటుంది. అది ఒక పెద్ద జోక్. నన్ను సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చింది. నోటీసులు ఇవ్వకుండా, నా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు.
ఒక పార్టీని నడిపే పద్దతి ఇది కానే కాదు. నా సస్పెండ్ పై లీగల్ గా ఛాలెంజ్ చేయవచ్చు. కానీ నైతికత లేని బీఆర్ఎస్ పై ఛాలెంజ్ చేయను. ఆ పార్టీకి దూరమవుతున్నందుకు సంతోషంగా ఉన్నా. నా సస్పెన్షన్ ను వాడుకునేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇది ఆస్తుల పంచాయితీ అంటున్నారు. నాకు దైవ భక్తి ఎక్కువ. లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి దేవుడు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ దేవుడి మీద, నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా. నాది ఆత్మగౌరవ పోరాటమే.
ఇక మన రాష్ట్రంలో మహిళ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 17 ఎంపీ స్థానాలు ఉంటే ఒక మహిళ ఎంపీ మాత్రమే ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మహిళ ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే. మండలిలో 40 మందిలో ముగ్గురు మాత్రమే మహిళ సభ్యులు. నేను వెళ్లిపోతే ఇద్దరే ఉంటారు. ఈ రాష్ట్రంలో మహిళల ప్రాతినిథ్యం 0.0003 శాతం మాత్రమే ఉంది. మరి ఆడవాళ్లకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి.
గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి. మహిళలకు సమాన హక్కులు రావాలని అన్నారు. పార్టీలు కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని మహిళలను ఎంకరేజ్ చేయాలి. మీరు అవకాశాలు ఇవ్వకపోతే ఇంకెవరు మహిళలకు అవకాశాలు ఇస్తారు? ఇప్పుడు నా దారి వేరైనా సరే నా లక్ష్యం మాత్రం ఒక్కటే.
బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్లు చేసిన తప్పులనే మీరు చేస్తే మాత్రం కచ్చితంగా ప్రజలు మీకు బుద్ది చెప్తారు. పార్టీలో కొంతమంది సామాన్యులు, ఉద్యమకారుల సమస్యలు కేసీఆర్ కి చేరకుండా అడ్డుగోడ కట్టారు. ఏ పార్టీ అయినా సరే రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయాలి. బీఆర్ఎస్ ఆ స్ఫూర్తితో లేదు.
ఈ సభ నుంచి నేను వ్యక్తి గా వెళ్తున్నా, భవిష్యత్ లో శక్తిగా తిరిగి వస్తాను. కచ్చితంగా ఓ కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిస్తాను. తెలంగాణ కోసం పనిచేసే పొలిటికల్ పార్టీ అవసరం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేసే శక్తిగా మేము నిలబడుతాం. లెప్ట్ పార్టీల సింపథైజర్లు, మావోయిస్టులను నాకు మద్దతివ్వాలని కోరుతున్నా.