– బొగ్గు అవినీతిపై అన్ని ఆధారాలు సమర్పిస్తా
– చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం
– రేవంత్ రెడ్డికి తెల్వకుండా సెట్ ఎలా వస్తుంది?
– రేవంత్ రెడ్డికి తెల్వకుండా సెట్ వస్తే ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్
– టీడీపీ నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసావు
– సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయతీ కాదా?
– మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులు
– సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలి
– ఈ విధానం వచ్చాక మొదటి లబ్దిదారులు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డి
– ఆయన కంపెనీ శోదా కన్స్ట్రక్షన్ కే ఈ సర్టిఫికెట్ వచ్చాక, మొదటి టెండర్ దక్కింది
– నైనీ బ్లాక్ లో వాటాల పంచాయతీ వచ్చి కొట్టుకునే పరిస్థితి
– కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి మన దేశంలో లేదు
– రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం
– కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ బ్లాక్ లో లేని విధానం సింగరేణిలో ఎందుకు?
– నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం అన్నారు.. మరి మిగతా వాటి సంగతి ఏమిటి?
– కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ విధానం రద్దు చేశారు
– డీజీపీ .. మీ ఖాకీ బుక్కు కాకి ఎత్తుకుపోయిందా?
— సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఫైర్
హైదరాబాద్ : సింగరేణి టెండర్ల కుంభకోణం, సీఎం, మంత్రుల వాటాల పంచాయతీలు చూస్తున్నాం. మరికొన్ని దిమ్మదిరిగే విషయాలు బయట పెడుతున్నాం. కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి నైనీ బ్లాక్ లో పెట్టారు. అందువల్ల నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నాం అని భట్టి అన్నారు.
కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి మన రాష్ట్రంలో లేదు. దేశంలో లేదు. వెస్టన్ కోల్ ఫీల్డ్, కోల్ ఇండియాలో కూడా లేదు.. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 2024లో సైట్ విజిట్ విధానం తెచ్చారు.. ఈ విధానం వచ్చాక మొదటి లబ్దిదారులు రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోదా కన్స్ట్రక్షన్ కే ఈ సర్టిఫికెట్ వచ్చాక, మొదటి టెండర్ దక్కింది..
ఈ విధానం వచ్చాక సింగరేణిలో ఆరు టెండర్లు కూడా ప్లస్ 7 పర్సంటేజ్ కు టెండర్లు వారి అనుయాయకులకు కట్టబెట్టడం జరిగింది.. ఎనీ ఓబీ కోల్ బ్లాక్ టెండర్ మన దేశంలో ఎక్కడ జరిగినా మైనస్ 10 నుంచి మైనస్ 22 శాతానికి పోతుంది. గతంలో సింగరేణి మైనస్ 7, మైనస్ 8, మైనస్ 10, మైనస్ 20 పోతుండే. మైనస్ 10 టు మైనస్ 20 ఎక్కడైనా ఉంటుంది..
రేవంతు వచ్చాక కొత్త విధానం తెచ్చాక అన్ని టెండర్లు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి పోతున్నాయి.. భట్టి కేవలం నైనీ టెండర్లు మాత్రమే రద్దు చేస్తాం అన్నారు.. మరి మిగతా వాటి సంగతి ఏమిటి?ఆన్ లైన్ టెండర్ల ద్వారా దేశంలో ఎవరైనా వేయొచ్చు.
కానీ సైట్ విజిట్ విధానంలో ముందే వెళ్లి సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి.. అంటే ఈ విధానంలో ఎవరు ముందుగానే టెండర్ వేస్తున్నారో తెలుసుకొని, బెదిరించి, భయపెట్టి వారికి టెండర్ దక్కకుండా చేసి, తమ అనుయాయులకు ప్లస్ 7 నుంచి ప్లస్ 20 శాతానికి కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టారు.. నైనీ బ్లాక్ లో ఇదే జరిగింది. వాటాల పంచాయతీ వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చింది.. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ బ్లాక్ లో లేని విధానం సింగరేణిలో ఎందుకు అనే దానిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.
రెండో కోణం ఏమిటంటే.. గతంలో ఇదే సింగరేణిలో బిఆర్ఎస్ సమయంలో ఉన్న టెండర్లు రద్దు చేసి, వాటినే తమ అనుయాయులకు కట్టబెట్టారు. అప్పుడు కాంపిటీటివ్ విధానంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, ఇప్పుడు ప్లస్ 7 మీద టెండర్లు కట్టబెట్టారు. గతంలో వెంకటేషన్ కని అనే టెండర్ బిఆర్ఎస్ హయాంలో మైనస్ 7 ఉంటే, ఇప్పుడు ప్లస్ 7మీద రీ టెండర్ చేసి కట్టబెట్టారు.
ఎస్ ఆర్ పీ ఎసీ టూ శ్రీరాంపూర్ అనే మైనస్ 7 టెండర్ రద్దు చేసి, ప్లస్ 7లో అప్పగించారు. ఎస్ ఆర్ పీ ఓసీ టూ విస్తరణ 2025 టెండర్ మూడు సార్లు వాయిదా వేశారు. డీల్ సెట్ కాక. మళ్లీ వారి అనుయాయులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మూడవ కోణం ఏమిటంటే… సింగరేణి గతంలో బల్క్ లో ఐఓసీఎల్ నుంచి సరఫరా చేసేవారు. కానీ పర్సెంటేజీల కోసం డీజిల్ ను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కమీషన్ల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ విధానం రద్దు చేశారు.
సింగరేణికి దీని వల్ల ఎక్కువ నష్టం.
చేసిన పని మీదనే కాదు, డీజీల్ కలుపుకొని జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సంస్థకు నష్టం కదా? ఇదంతా ముఖ్యమంత్రి దగ్గరి సన్నిహితులు, సమీప బంధువు కనుసంజ్నల్లో జరుగుతున్నది. ఎవరికి సర్టిఫికేట్ రావాలన్నా, టెండర్ రావాలన్నా వారి ఆదేశం లేనిదే దక్కదు.
చీటికి మాటికి సిట్ అంటున్నవు, నీకు నిజాయితీ ఉంటే దమ్ముంటే సీబీఐ విచారణకు అనుమతించు.అన్ని వివరాలు అందించేందుకు నేను సిద్దం.
రేవంత్ రెడ్డి, బిజేపీ అక్రమ సంబంధం లేకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. రెండేళ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీ లేడు. ఇంచార్జీని పెట్టి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు.
భట్టి.. మీరు సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు అన్ని నైనీ రద్దు చేశారు కదా. అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలని, డీజిల్ విధానం రద్దు చేయాలని, సింగిరేణికి సీనియర్ అర్హత కలిగిన సీఎండీని పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
క్యాబినెట్ దండుపాళ్యం ముఠా అంటే నా మీద పడ్డారు.. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటి రెడ్డి మధ్య వాటాల పంచాయతీ కాదా?
మధ్యలో ఐఏఎస్, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారు. తన్నుకు చచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం. ఇందులో జర్నలిస్టులు, ఐఏఎస్ లో ఏం పాపం చేశారు? .
గతంలో దక్కన్ సిమెంట్స్ యజమానిని సీఎం ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌజ్ లో తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారని మంత్రి కుమార్తె చెప్పింది. సీఎం అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి అని కూడా చెప్పారు. వ్యాపారవేత్తల వద్ద బెదిరించి సంపాదించుకున్న డబ్బులో, పంచుకోవడంలో వాటాల పంచాయతీ.
సమ్మక్క సారక్క టెండర్లు దక్కలేదని పొంగులేటి , టెండర్లు దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బికి మార్చి టెండర్లు దక్కించుకున్నరు.
హోలో గ్రాం టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మధ్య ఐఏఎస్ బలి అయ్యాడు. కోమటి రెడ్డి ని చూసినం.. సంతకం పెట్టకముందే సినిమా జీవోలు వస్తున్నయ్యని అన్నడు.. సినిమా రేట్ల విషయంలో ముఖ్యమంత్రి వర్సెస్ కోమటి రెడ్డి. ఇన్ని పంచాయతీలు, మంత్రుల పంచాయతీలు.
ఆరు గ్యారెంటీలు అటకెక్కినయి, వాటాలా పంచాయతీలు ముందుకు వచ్చినయి.. కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ 8 కోట్ల కోసం కాంట్రాక్టర్ నే బెదిరించాడు.. కాంట్రాక్టరే స్వయంగా పోలీసు డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చిండు.. బిఆర్ఎస్ ను, జర్నలిస్టులను వేధించడానికి సిట్లు.. ఖాకీ బుక్కు అందరికి సమానం అనే డిజిపి శివధర్ రెడ్డి .. మీ ఖాకీ బుక్కు కాకి ఎత్తుకుపోయిందా? సజ్జనర్ గారు.. జర్నలిస్టులను బెదిరించావు కదా? ఏమైంది హూంకరింపు? ఇవన్నీ కనిపించడం లేదా?
ఇదొక దండుపాళ్యం ముఠా లెక్క అయ్యింది. కేసీఆర్ పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తయారు చేస్తే, కాంగ్రెస్ రాగానే బెదిరింపులు, భూ కబ్జాలు.. రేవంత్ రెడ్డికి తెల్వకుండా సెట్ ఎలా వస్తుంది? రేవంత్ రెడ్డికి తెల్వకుండా సెట్ వస్తే ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు తెల్వకుండా సెట్ వస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్. సర్కార్ నడుపుతున్నరా,? సర్కస్ నడుపుతున్నరా?
రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. .
బిఆర్ఎస్ జెండా గద్దె జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది జాగ్రత్త.. దుమ్ముదుమ్ము అయిపోతవు రేవంత్ రెడ్డి. నువ్వు కూలిస్తే కూలిపోవడానికి బిఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ..
హౌలా మాటలు బంద్ చేయి.. ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టు. క్యాబినెట్ పెట్టుకున్నరు, రైతు బంధుపై, ఎరువుల కొరతపై చర్చ లేదు.. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల గురించి చర్చలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నావు.
రాజీవ్ గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ని అవమానిస్తే తెలుగు దేశం పార్టీ పుట్టింది.
ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పెట్టారు కదా? తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ కు వ్యతిరేకం.. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ ప్రతిన బూనారు. అంత ప్రేముంటే తెలుగుదేశంలో ఉండాల్సింది. టీడీపీ నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసావు
కాంగ్రెస్ భూస్థాపితం అయితే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుచుతుంది.. నాలుగు ఓట్ల కోసం తెలుగుదేశం కోసం మాట్లాడుతున్నావు.. కాంగ్రెస్ దేశం మొత్తం బిజేపీకి వ్యతిరేకంగా పోరాడితే, నువ్వేమో బిజేపీ, చంద్రబాబుతో కలిసి ఉంటవు..
కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ లీడర్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. సైట్ విజిట్ విధానం తప్పు అని నైనీ టెండర్లు రద్దు చేశారు. అదే విధానంలో జరిగిన ఆరు టెండర్లు రద్దు చేయాలి.. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని డిమాండ్ చేస్తున్నాం.
వైయస్ఆర్ వీర విధేయుడిని అని చెప్పుకునే భట్టి , తెలుగుదేశం మీద ప్రేమ చూపే రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారే.
అన్ని విషయాలు బయటపెడుతాం అన్న మాటకు కట్టుబడి అన్ని వివరాలు బయట పెట్టాలని భట్టి గారిని కోరుతున్నాం.. కాంగ్రెస్ బొగ్గు స్కాంపై న్యాయస్థానాలకు సైతం వెళ్లి కొట్లాడుతం..